అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది. ఇటీవల వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఖమ్మం జిల్లాలోని కల్లూరు జెడ్పీటీసీ, కరీంనగర్ నగర పాలక సంస్థలో కార్పొరేటర్ తమ పదవులకు రాజీనామా చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులు త మ పదవులను వదులు కోవడంతో పాటు, ఏకంగా పార్టీకి కూడా గుడ్ బై చెప్పడంపై దుమారం రేగుతోంది. పార్టీని వీడిన ప్రజాప్రతిధులు ఇద్దరు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లక్ష్యంగా విమర్శలు సంధించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
కాగా ఈ వరుస ఘటనలను ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు పార్టీలో ఏం జరుగుగుతోందని ఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల కింద ఖమ్మం జిల్లా కల్లూరు జెడ్పీటీసీ జర్పుల లీలావతి తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గిరిజన మహిళ నైన తనను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా అవమానిస్తున్నాడని ఆరోపించారు. ఆయన వైఖరితో విసుగు చెంది పార్టీకి, పదవికి రిజైన్ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా ఈ వివాదం ముగియక ముందే ఆదివారం కరీంనగర్ గ్రేటర్ కార్పొరేషన్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 12వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత తన పదవికి రాజీనామా చేశారు.
కార్పొరేటర్ పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆమె భర్త చంద్రశేఖర్ కూడా పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తమను చిన్నచూపు చూడటం, అభివృద్దికి నిధులు కేటాయించకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేగాక ఎమ్మెల్యే వేధింపులు ఆపకపోతే ఆయన ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
వరుసగా ఇద్దరు ప్రజాప్రతినిధులు మీడియా ముందుకొచ్చి బహిరంగంగానే స్థానిక ఎమ్మెల్యే, మంత్రులపై ఆరోపణలు గుప్పించడంతో టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే, మంత్రులు పదే పదే అధికార పార్టీ నేతలను టార్గెట్ చేయడం పట్ల పార్టీలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈ అంశం పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారన్నది తేలాల్సి ఉంది.గతంలోనూ కరీంనగర్ కార్పొరేషన్ లో 30వ డివిజన్ కార్పొరేటర్ రాజీనామా చేశారు. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఆమెకు ఎదురవడం గమనార్హం.