సాధారణ ఎన్నికలకు ఏడాది ముందుగానే రాష్ట్రం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అవిశ్వాసం పెట్టాలని పవన్ పిలుపునివ్వటం...అందుకు ముందుగా టీడీపీనే ఒప్పించాలని జగన్ సవాల్ విసరటం... సవాల్ ను స్వీకరించిన పవన్ మద్దతు కూడగడతానని చెప్పటం చకచకా జరిగిపోయాయి.. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సహితం అవిశ్వాసం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ తేల్చి చెప్పటంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
20 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పట్టిన బడ్జెట్, రాష్ట్రంలో రసవత్తర రాజకీయాలకు తెరలేపింది. విభజన చట్టంలో ఇచ్చిన హమీలు అమలు చేయకపోవటం, పూర్తి స్థాయి చివరి బడ్జెట్ గా భావించే ఈ బడ్జెట్ లో రాష్ట్రానికి సరైన నిధులు కేటాయించకపోవటంతో. కేంద్ర ప్రభుత్వం పై అసంతృప్తిగా ఉన్న సీఎం చంద్రబాబు..అవసరమైతే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వెనుకాడమని ప్రకటించారు.
విజయవాడలో జరిగిన మాదిగల మహా సభలో కేంద్రం వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఐదు కోట్ల ఆంధ్రుల తరపున కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా మంది పోరాటం చేస్తున్నారని, వారి వారి అభిప్రాయాలు, సహకారం తీసుకుంటామని వెల్లడించారు.
మరో వైపు రెండు రోజుల క్రితం ఇదే విషయంలో వైసీపీ అధినేత జగన్ విసిరిన సవాల్ ను జనసేనాని పవన్ కల్యాణ్ స్వీకరించారు. పార్లమెంట్ లో వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు కూడగట్టే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. సీపీఐ, సీపీఎం, బిజూ జనతాదళ్, ఆమ్ ఆద్మీ తో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీల మద్దతు కూడగడతానని స్పష్టం చేశారు. తనను టీడీపీ పార్ట్ నర్ అన్న జగన్ వ్యాఖ్యలపై స్పందించిన పవన్.. తాను టీడీపీకి మద్దతు మాత్రమే ఇచ్చానని.. ప్రభుత్వంలో లేనని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా జగన్ వాళ్ల ఎంపీలను సెక్రటరీ జనరల్ దగ్గరకు తీసుకెళ్లాలని సూచించారు.
చంద్రబాబు కంటే ముందుగా పవన్ అవిశ్వాస వాఖ్యలకు ధీటుగా స్సందించిన ప్రతిపక్షనేత జగన్.. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైసీపీ సిద్ధమని ప్రకటించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడతామన్నా మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. టీడీపీ అవిశ్వాసం పెట్టకపోయినా మార్చి చివరి వారంలో తామే అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించారు. టీడీపీ, పవన్ కల్యాణ్ లు ప్యాకేజీ అంశాన్ని పక్కన పెట్టి హోదా కోసం పోరాడాలని సూచించిన జగన్.. ఏప్రిల్ 6 వ తేదీ వరకు ప్రత్యేక హోదాపై కేంద్ర స్పందిచకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పి ప్రస్తుత రాజకీయాలలో ఆసక్తి పెంచారు..
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకున్న పరిస్థితుల దృష్ట్యా పవన్ ప్రకటనను సీరియస్ గా తీసుకున్న అధికార, ప్రతిపక్షాలు ఎక్కడా తగ్గకుండా కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమని ప్రజలలోకి సంకేతాలు పంపుతున్నాయి.. వీరిలో ఎవరు ముందుగా కేంద్రంపై అవిశ్వాసం పెడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.