తెలంగాణ సీఎం కేసీఆర్.. తన వ్యూహానికి మరింత పదును పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని ఆయన ముందుగానే నిర్ణయించుకున్న మేరకు ఇప్పుడు తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక, ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఏకంగా సవాల్ రువ్వాడు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే.. తాను కుటుంబంతో సహా రాజకీయాల నుంచి తప్పుకొంటానన్నారు. అదేసమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. అయితే, దీనిపై ఎలాంటి ముందడుగూ పడకపోయినా.. తన పవర్ను మళ్లీ చూపించాలని కేసీఆర్ పంతం పట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ను భారీ స్థాయిలో దెబ్బకొడితేనే తప్ప తిరిగి అధికారంలోకి రావడం సాధ్యం కాదని కేసీఆర్ గుర్తించారు.
ముఖ్యంగా గత ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఓడిన నియోజకవర్గాలను వచ్చే 2019 ఎన్నికల్లో కైవసం చేసుకోవాలని భావించారు. దీంతో గతంలో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్న నేతలు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్లను తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా తాను అనుకున్నది సాధించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. కానీ ప్రస్తుతం మౌనంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరినీ టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆర్ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆశించిన మేరకు బేరాలు కుదరకపోవడంతో ఇద్దరూ దూరంగానే ఉంటున్నారు.
అయితే, ఇప్పుడు వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడం, గెలిచి తీరాల్సిన పరిస్థితి పెరగడంతో కేసీఆర్ ఈ ఇద్దరు నేతల కోరికలు ఏ రేంజ్లో ఉన్నా తీర్చి పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే సమయంలో వీరితో పాటు మరికొంత మంది సీనియర్లను కారెక్కించుకునేందుకు కేసీఆర్ అంతర్గతంగా చక్రం తిప్పుతున్నారని ఊహాగానా లు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీలతో పాటు శివారు నియోజకవర్గాలైన ఇబ్రహీం పట్నం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి వంటి స్థానాల్లో టీడీపీ జయకేతనం ఎగరవేసింది.
మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాన్ని సైతం టీడీపీనే గెలుచుకుంది.కానీ ఆ తర్వాత ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మినహా మిగతావారంతా కారెక్కారు. ఇక మరోవైపు ఉప్పల్, ఖైరతాబాద్, అంబర్ పేట్, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. ఈ స్థానాలన్నింటిలోనూ 2019లో పాగా వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ దానం, ముఖేష్ లకు గాలం విసురుతున్నారని తెలుస్తోంది. మరి ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక, ఇదే సమయంలో వీరిద్దరినీ కాపాడుకునేందుకు, పార్టీ మారకుండా ఉండేందుకు కాంగ్రెస్ తన వంతు ప్రయత్నాలు తాను చేస్తోంది. మొత్తానికి రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయన్నమాట.