ప్రముఖ నటుడు కమల్ హాసన్ బుధవారం రాజకీయ పార్టీని స్థాపించబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని మదురైలో ఆయన రాజకీయ పార్టీని ప్రకటించి.. విధివిధానాలు వెల్లడించనున్నారు.రేపు మధురైలో ఆయన నూతన పార్టీని ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటూ పలువురు వామపక్ష నేతలు పాల్గొననున్నారు. మధురైలో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించిన తర్వాత.. కమల్ నేరుగా రామేశ్వరం వెళ్లనున్నారు.
అక్కడ అబ్దుల్ కలాం సమాధిని దర్శించుకొని, రాజకీయ యాత్రను ప్రారంభిస్తారు. రాజకీయాల్లోకి వస్తున్నానని గతంలోనే ప్రకటించిన కమల్ రాష్ట్రమంతటా పర్యటిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా ఆయన తమిళనాడు ప్రజలను నేరుగా కలుసుకొని.. వారి కష్టనష్టాలు, ఆకాంక్షలు తెలుసుకొన్నారు. తమిళనాడులో కొంత కాలంగా రాజకీయలు ఏ రకంగా సంచలనాలు సృష్టిస్తున్నాయో అందరికీ తెలుసు. జయలలిత మరణం తర్వాత అక్కడి రాజకీయాల్లో ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ నెలకొంటుంది.
ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మద్య ఏ రేంజ్ లో పోటీ నడుస్తుందో అందరికీ తెలుసు. తాజాగా ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో సినీతారల సందడి నెలకొంటుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటులు కమల్ హాసన్ లు కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రాబోతున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి తమిళనాడులోని అన్ని పార్టీల నేతలను కలుస్తున్న కమల్.. అన్నాడీఎంకే నేతలను మాత్రం కలువలేదు.
అన్నాడీఎంకే నేతల అవినీతి కారణంగానే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని, అందుకే ఆ పార్టీకి సంబంధించిన నేతలను కలువలేదని కమల్ తెలిపారు. ఇప్పటికే కమల్ సూపర్ స్టార్ రజనీకాంత్, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్కాంత్లతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే.