భాగ్యనగరంలోని ఐటీ కారిడార్ లో మోనోరైలును ప్రవేశపెట్టాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం పది మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి మెంబర్ కన్వీనర్ గా ఉండే ఈ కమిటీలో ప్రభుత్వ సలహాదారు జీ వివేక్, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐటీ,సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి, సలర్-పూరియా గ్రూపు ఎండీ, ఫోనిక్స్ గ్రూపు చైర్మన్, మీనాక్షీ గ్రూపు చైర్మన్, ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్అండ్టీ ఎంఆర్హెచ్ఎల్ సీఈవో, ఎండీ, గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో, ఎండీ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మెట్రోరైలు ప్రాజెక్టు ఫేస్-2, ఫేస్-3 కారిడార్లను సూచించడమే కాకుండా మోనోరైలు, ట్రామ్, ఈ-వెహికిల్స్ తదితర అత్యుత్తమ, అతిచౌక రవాణా విధానాలను సూచించనున్నది.
అంతేకాకుండా పీపీపీ, జాయింట్ వెంచర్, యాన్యుటీ తదితర విధానాలు సహా నిధుల సమీకరణపై కూడా ఈ కమిటీ సూచనలు అందించనున్నది. ఈ కమిటీ అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా సిఫారసులను ప్రభుత్వానికి అందించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడం తోపాటు ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు మెట్రోరైలు, బస్సులు, మోనోరైల్, ఎంఎంటీఎస్, ట్రామ్వే, ఈ-వెహికిల్స్ తదితర సమీకృత రవాణా వ్యవస్థను చేపట్టాల్సి న అవసరం ఉన్నదని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భావిస్తున్నారు.
అంతేకాకుండా నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలో వచ్చే 50 ఏండ్లలో పెరిగే ట్రాఫిక్ అవసరాలను, ఔటర్ రింగురోడ్డు, జాతీయ/రాష్ట్ర రహదారులు, శాటిలైట్ టౌన్షిప్లు, అర్బన్ లోకల్ బాడీలు తదితరవాటిని దృష్టిలో ఉంచుకొని రవాణా వ్యవస్థకు రూపకల్పన చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధి కారులు, కార్పొరేట్ సెక్టార్ల ప్రతినిధులతో టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేశారు.