ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు తనపై దాడికి పాల్పడ్డారని సీఎస్ అన్షు ప్రకాశ్ ఆరోపించారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్పై దాడి చేసిన కేసులో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలకు ఢిల్లీ కోర్టు గురువారం వరకూ జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు అమాన్తుల్లా ఖాన్, ప్రకాష్ జార్వల్ బెయిల్ పిటిషన్ను గురువారం కోర్టు విచారించనుంది. ప్రకాష్ జార్వల్ను మంగళవారం రాత్రి అరెస్టు చేయగా, అమాన్తుల్లాను బుధవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు.
బుధవారం విచారణలో ముందుగా కోర్టు ఎమ్మెల్యేల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. కాగా, ముఖ్యమంత్రి ఎదురుగానే ఎమ్మెల్యేలు తనపై చేయిచేసుకున్నారంటూ తెలిపారు. సదరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఎల్జీని కోరారు. ప్రభుత్వ పథకాలపై సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం కేజ్రీవాల్ ఇంట్లో చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తూ.. ఇంటింటికీ ప్రభుత్వ సేవల పథకంపై సమీక్షకు రమ్మంటూ సీఎంవో నుంచి తనకు సమాచారం అందిందని తెలిపారు.
కాగా, సీఎస్పై దాడి ఘటన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఐఏఎస్ల సంఘం సమావేశమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారిపై దాడికి పాల్పడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన సంఘం నేతలు.. దీనిపై ఎల్జీ బైజల్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఎమెల్యేలు విచారణకు సిద్దంగా వున్నారని మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ షెఫలీ బర్నాలా తెలిపారు. భారీ బందోబస్తు మధ్య ఇద్దరు ఎమ్మెల్యేలను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వద్దకు ఆప్ కార్యకర్తలు, న్యాయవాదులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
ఢిల్లీలో చరిత్రాత్మక విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి మొదటి నుంచి ఏవో సమస్యలు చుట్టుముడుతున్నాయి. భాజపా ప్రభుత్వం, ఆమ్ఆద్మీ మధ్య సయోధ్యతో కూడిన వాతావరణం మొదటి నుంచి లేదు. అప్పట్లో లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మధ్య వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోపణలను ఆప్ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు.