గత కొంత కాలంగా దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఓ వైపు ప్రభుత్వం రోడ్డు భద్రతా చర్యలు పాటించాలని విపరీతంగా ప్రచారం చేస్తుంటే..మరోవైపు అంతకంతకూ ప్రమాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకోవాలని ప్రభుత్వం రూల్ పెట్టింది. కానీ కొంత మంది నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ..హెల్మెట్ పెట్టుకోకుండా తమ ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఎన్నో జరిగాయి.
హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపించడం నేరమని తెలిసినా, అది చాలా చిన్న నేరమేలే అన్నట్టు వాహనదారులు ప్రవర్తిస్తుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. పోలీసుల తనిఖీల్లో హెల్మెట్ లేకుండా పట్టుబడితే సాధారణంగా రూ. 100 నుంచి రూ. 200 వరకూ జరిమానా విధిస్తుంటారు. తాజాగా ఆగ్రా పోలీసులు ద్విచక్ర వాహనదారులకు వింతైన శిక్షణను విధిస్తుంది. హెల్మెల్ ధరించని వారిని పట్టుకొని అర కిలోమీటర్ నడవమని పనిష్మెంట్ ఇస్తున్నారు.
నడవడం సరదాగా అలా నడుచుకుంటూ వెళ్లడం కాదు. బైక్ను కూడా తోసుకుంటూ. జరిమానా కడతామని బతిమాలినా... వినడం లేదు నడవాల్సిందేనని తేగేసి చెబుతున్నారు. ఇలా నడిస్తే ఒంటికి కూడా మంచి వ్యాయామం అంటున్నారు. అంతేకాదు హెల్మెట్ ఉన్నవాళ్లకే పెట్రోల్ పోయాలని కూడా నిబంధన తీసుకొచ్చారట. అలాగే స్కూల్, కాలేజీలకు వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలనే నిబంధనల్ని తెచ్చారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు కూడా సూచించారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ శిక్ష హాట్ టాపిక్గా మారింది.