వైసీపీ అధినేతకు ఇప్పుడున్న సమస్యలు చాలవన్నట్టు.. సరికొత్త సమస్య వచ్చి పడింది. అది కూడా సొంత పార్టీ ఎంపీల నుంచే కావడం గమనార్హం. ఉన్నదే అయిదుగురు అయినప్పటికీ.. జగన్కు వారు నిద్ర పట్టనివ్వడం లేదు. పైకి ఏమీ కానట్టు, లేనట్టే కనిపిస్తున్నా.. పార్టీలో అంతర్గతంగా మాత్రం చిచ్చు రగిలిపోతోంది. రేపో మాపో ఈ బండారం బయటపడి.. జగన్ను ఏకాకి చేసే దిశగా కూడా నేతలు పావులు కదుపుతున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతలను తీవ్రస్థాయిలో కలవర పెడుతున్నాయి. ఆయన ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో? ఎప్పుడు ఎలాంటి సంచలన ప్రకటన చేస్తాడో కూడా తెలియడం లేదని, మమ్మల్ని, మా సహనాన్ని ఆయన పరీక్షిస్తున్నాడని నేతలు తెగ ఫీలైపోతున్నారు.
అంతేకాదు, జగన్ ఇటీవల తీసుకున్న ఎంపీల రాజీనామా నిర్ణయంపై వారు ఎవరినడిగి మీరు మా పదవులకు ఎసరు పెడుతున్నారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆనాడు 2014 ఎన్నికలకు ముందు టికెట్ ఇచ్చేందుకు ఎన్ని తిప్పలు పెట్టారో గుర్తు లేదా? అంత కష్టపడి సీటు సంపాయించుకుని భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి గెలిస్తే.. ఇప్పుడు అర్ధంతరంగా రాజీనామా? అంటే ఎలా? అంటూ వాపోతున్నారు. అధినేతను కడిగేయాలని ఒకరిద్దరు నేతలు ఉరుకు పెడుతుంటే.. మరో ఇద్దరు మాత్రం సమయం ఉందని సర్ది చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు ముదిరి పాకాన పడితే.. తమ దారి తాము చూసుకోగలమని, అప్పుడు మీరే బోనులో నిలబడాల్సి వస్తుందని సదరు ఎంపీలు హెచ్చరించిన స్థాయిలో అంటున్నారని లోటస్ పాండ్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం జరిగే సమయంలో ఆందోళన చేస్తామంటే వొద్దని చెప్పి.. పైగా బాయ్కాట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిన జగన్ ఇప్పుడు ఫలానా తేదీన రాజీనామాలు చేయమని చెప్పడం ఏంటని ఎంపీలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఎంపీ విజయసాయిరెడ్డి బడ్జెట్ బాగుందని చెప్పడం పార్టీ పరువు తీయలేదా? అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, సుజనాచౌదరి రాష్ట్రం కోసం రాజ్యసభలో మాట్లాడితే ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజయసాయిరెడ్డి కోరడం సెల్ఫ్గోల్తో సమానమని వైసీపీ సీనియర్ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించి నట్టు తెలుస్తోంది.
రాజీనామాల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం కూడా వైసీపీ ఎంపీలకు అస్సలు రుచించలేదని ఆ నేత విశ్లేషించారు. పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తెలుగుదేశాన్ని చూసి తమ ఎంపీలను బలిపశువులు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి పెద్ద తప్పు చేశామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ సమావేశాలు కూడా బాయ్కాట్ చేస్తే ప్రజలు ఊరుకోరని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా వైసీపీలో ఎంపీల రాజీనామా తేదీ నిర్ణయం వెనుక జరిగిన అంతర్గత చర్చలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. మరి వీటిపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో? గొడవ సర్దు బాటు అవుతుందో వీధిన పడుతుందోనని అంటున్నాయి లోటస్ పాండ్ వర్గాలు.