రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి ఎప్పటికప్పుడు శరవేగంగా మారుతున్నాయి. ఏపీ విభజన చట్టంలోని హామీలను సాధించే క్రమంలో ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములను కూడా అంచనా వేస్తున్నారు నేతలు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు, ఏపీ విభజన చట్టంలోని హామీలను సకాలంలో అమ లు చేయించుకోవడమే తక్షణ కర్తవ్యంగా భావిస్తున్న అధికార టీడీపీ.. ఈ క్రమంలో ఏ రోజు వ్యూహాన్ని ఆ రోజునే అమలు చేస్తోంది. వాస్తవానికి ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు అనే అంశం ఈరోజు కొత్తకాదు. 2014లో రాష్ట్రం ఏర్పాటైన ప్పటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు కూడా హామీల అమలు అలానే ఉండిపోయింది. అయితే, రాష్ట్రం అబివృద్ది చెందాలంటే.. కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఉండాలని భావించి.. తాను బీజేపీకి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు చంద్రబాబు.
దీంతో గత ఎన్నికల్లో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. కేంద్రంలో బాబు మిత్రపక్షం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, అప్పటి నుంచి ఇప్పటికీ ఏపీకి జరిగిన ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. ఇక, ఇప్పుడు ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఏ పార్టీకి ఆపార్టీ.. ఈ హోదా హామీల అమలు సహా ప్రత్యేక హోదా పైనా దృష్టి పెట్టాయి. ఇప్పుడు ఇది చంద్రబాబు జీవన్మరణ సమస్యగా మారింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని ఆయన భావిస్తున్నారు. అయితే, ఈ నాలుగేళ్ల కాలంలో చెప్పుకొనే రేంజ్లో చేసిన అభివృద్ది కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు విభజన చట్టంలోని హామీల అమలు చేయించుకోవడం తప్పనిసరిగా మారింది.
దీంతో గత పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ ఎంపీలను కేంద్రంపై పోరుకు సిద్దం చేశారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న సుజనా, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను కూడా సీఎం చంద్రబాబు వాడుకున్నారు. అయినా కేంద్రంలో ఆశించిన మేరకు కదలిక రాలేదు. మరోపక్క, ఎన్నికలకు సమయం ముంచుకు వస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే పనిని పెట్టుకున్నారని అంటున్నారు విశ్లేషకులు.
తాజాగా గత రెండు రోజులుగా చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు దీనినే ధృడపరుస్తోందని చెబుతున్నారు. విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలన్నదే ఐదు కోట్లమంది ప్రజల మాట అని చంద్రబాబు చెబుతున్నారు. పాలకులు చేసిన తప్పులకు జనాన్ని బలిచేయవద్దని కేంద్రానికి హితవు పలికారు.
ప్రత్యేక హోదా ఆంధ్రప్రజల హక్కు అని... అది ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సీఎం స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చేవరకు సహాయం చేయాల్సిందే నన్నారు. అయితే, ఇదే మాట రెండేళ్ల కిందట ఏమైందనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. భావోద్వేగాలను రెచ్చగొట్టి.. రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి బాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.