ఉత్తర్ ప్రదేశ్ లో గత కొంత కాలంగా నేరస్థుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచారు..సీఎం యోగి ఆదిత్యనాథ్. ఓ  పక్క నేర సామ్రాజ్యంపై ఉక్కుపాదం మోపుతున్నా యూపీలో మాత్రం నేరాల సంఖ్య తగ్గకుండా ఉంది. ముఖ్యంగా మహిళలు, యువతులపై కొంత మంది కామాంధులు అత్యాచారాలు, హత్యలకు తెగబడుతున్నారు.  తాజాగా యూపీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ పద్దెనిమిదేళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవదహనం చేశారు.

అత్యంత పాశవికమైన ఈ ఘటన రాజధాని లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలోని ఉన్నావ్ జిల్లా బారా సగ్వార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గురువారం సాయంత్రం 4.30 ప్రాంతంలో కూరగాయలు తీసుకురావడానికి సైకిల్‌పై మార్కెట్‌కు వెళ్లిన యువతి, గ్రామ శివారుల్లో కాలిబూడిదైంది. ఈ వార్త తెలిసి ఆ యువతి కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని, సైకిల్‌, చెప్పులు ఆధారంగా ఆమెను గుర్తుపట్టారు.

అన్ని అధారాలను సేకరించి, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలియజేశారు. ఇది ఒక్కరుచేసిన పనికాదని, ఇద్దరు ముగ్గురి ప్రమేయం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత యువత అరుపులు విని ఘటన స్థలికి చేరుకున్నామని, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వాచ్‌మెన్ భౌరీ రామ్ తెలిపారు.

గ్రామంలో ఆ యువతికి ఎవరితోనూ శత్రుత్వం లేదని అన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని..త్వరలో నింధితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని  ఎస్పీ పుష్పాంజలి దేవి తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దేశంలో జరుగుతోన్న మొత్తం నేరాల్లో 9.5 శాతం యూపీలోనే జరుగుతున్నాయి. అంతేకాదు మహిళలపై నేరాల్లో 14.5 శాతం ఇక్కడే చోటుచేసుకుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: