రాజకీయాలన్నాక అధికారమే పరమావధి. కనీసం వార్డు కౌన్సెలర్ అయినా చాలనుకునే నేతలు నేటి రాజకీయాల్లో కామన్. దానిని అడ్డం పెట్టుకునైనా సరే.. అధికారం చెలాయించేయాలని, దర్పం ప్రదర్శించేయాలని నేతలు భావిస్తున్న నేటి కాలంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వింత సంస్కృతిని తెరమీదకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని ఉన్నా.. అది సాధ్యం అవుతుందో కాదోనని కాంగ్రెస్ దళంలో భారీ ఎత్తున అనుమానపు బీజాలు నాటుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారుగానే తమ తమ గెలుపుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అంటే, పార్టీ గెలవకపోయినా.. తమకు పదవులు దక్కక పోయినా.. ఫర్వాలేదు. కనీసం .. తమ సీటును తాము దక్కించుకుంటే మేలని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారు పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే మేం పాదయాత్ర చేస్తామంటే మేం చేస్తామంటూ గత ఏడాదిగా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్న నాయకులు తాజాగా గ్రీన్ సిగ్నల్ తెచ్చేసుకున్నారు. ఈ క్రమంలోనే.. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నేతలంతా పాదయాత్రకు సై అంటున్నారు. ఇక ఈ రేసులోకి తాజాగా డీకే అరుణ కూడా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేస్తే ఓవరాల్ గా కలిసి వస్తుందని గద్వాల జేజమ్మ భావిస్తున్నారని సమాచారం. అందుకే ఆమె స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాదయాత్రను చేపట్టాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావడం ముఖ్యమని, ఆ తర్వాత సీఎం అభ్యర్థి ఎవరనేది అధిష్టానం చూసుకుంటుందనే అభిప్రాయాన్ని అరుణ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ చేపట్టాలనుకుంటున్న బస్సు యాత్ర కన్నా డీకే అరుణ లాంటీ లీడర్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే మంచి మైలేజ్ వస్తుందని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అది కుదరకపోతే ఆమె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయని జిల్లా నేతలు అంటున్నారు. అంటే ఒక రకంగా టీ కాంగ్రెస్ వ్యూహాన్ని ఆ మహిళా నాయకురాలు హైజాక్ చేసేందుకు సైతం రెడీ అయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అయితే, ఇదే తరహాలో మిగిలిన నేతలు కూడా తమ తమ జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించుకుంటామని చెబుతున్నారు. అయితే, అంతా కలసి ఒకే దఫా బృందంగా నడిస్తే.. వచ్చే ఊపు ఇలా ఒక్కరొక్కరుగా రాదనేది మరికొందరి వాదన. కానీ, ఎవరికి వారే సీఎం అభ్యర్థులు అయినప్పుడు టీ కాంగ్రెస్ భవిష్యత్తును ఎవరు నిర్ణయిస్తారని అంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా పదవుల కన్నా ముందుగా టీ కాంగ్రెస్ నేతలు.. పాదయాత్రకు పోటీ పడడాన్ని వింతగా చర్చించుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.