రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. 16 రాష్ట్రాల్లో 58 స్థానాల ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ షెడ్యూల్ను ప్రకటించింది. ఏపీ, తెలంగాణల్లో ముగ్గురు సభ్యుల పదవీ కాలం త్వరలోనే ముగియనుండగా, ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు మార్చి 23న ఓటింగ్ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్లో మూడు, తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
16 రాష్ట్రాలకు చెందిన 58 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ముగియనుండటంతో ఆయా స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహించిన వీరేంద్ర కుమార్(జేడీయూ)రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి అదేరోజు ఉపఎన్నిక జరగనుంది. దీంతో ఎన్నికలు జరుగబోయే మొత్తం స్థానాల సంఖ్య 59 కానుంది.
ఆంధ్రప్రదేశ్లో కె.చిరంజీవి, రేణుక చౌదరి, టి.దేవేందర్ గౌడ్, తెలంగాణలో సి.ఎం రమేష్, రాపోలు ఆనంద్ భాస్కర్, పాల్వాయి గోవర్థన్ రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుంది.అంతే కాదు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, నటి రేఖ, జయాబచ్చన్ లతో పాటు ఇతర రాజకీయ పార్టీల ముఖ్యనేతలు పదవీకాలము ఏప్రిల్ 2 తో ముగియనుంది.
పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఇటీవలే మృతి చెందారు. ఇక రిటైరయ్యే వారిలో ఎనిమిది మంది కేంద్రమంత్రులు ఉన్నారు. వీరిలో అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రదాన్, జెపి నడ్డా, ప్రకాశ్ జవదేకర్, తావర్ చంద్ గెహ్లాట్, పురుషోత్తం రూపాలా, మన్సుఖ్ ఎల్.మాండవీయలు ఉన్నారు.
మార్చి 5న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు గడువును మార్చి 12వ తేదీగా ఈసీ ప్రకటించింది. మార్చి 13న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు మార్చి 15వరకూ గడువుగా ఎన్నికల సంఘం తెలిపింది.