శ్రీదేవి మరణించి అటూ ఇటూగా వారం రోజులు అవుతున్నా..ఇంకా ఆమె జ్ఞాపకాల్లోనే అభిమానులు కాలం గడుపుతున్నారు. ఒకప్పటి ఆమెకు సంబంధించిన ఘటనలు, ఉదంతాలు గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో శ్రీదేవికి సంబంధించిన విశేషాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని ఆసక్తికరమైనవీ ఉన్నాయి.


శ్రీదేవి కపూర్ల కుటుంబానికి చెందిన బోనీ కపూర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కపూర్ల కుటుంబం హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తుంది. హిందువుల పండుగలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. తాజాగా ఇటీవల దుర్గా పూజ సమయంలోనూ శ్రీదేవి కుటుంబం సందడిగా గడిపింది. 


ఉత్తరాదిలో దుర్గాపూజ సందర్భంగా సిందూరే కేలా అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అమ్మవారికి ముత్తయిదువలు సింధూరాన్ని సమర్పించుకుంటారు. అలాగే పూజ చేస్తారు. ఆ పూజా సమయంలో ముత్తయిదువలు ఒకరికొకరు సింధూరం పూసుకుంటారు. ఈ ఏడాది దుర్గా పూజ సమయంలోనూ శ్రీదేవి కుటుంబం సింధూర కేలా కార్యక్రమం ఘనంగా నిర్వహించింది. 


సాంప్రదాయబద్దంగా ఒకరికొకరు సిందూరం పూసుకున్న తర్వాత.. కొందరు తమాషాగా శ్రీదేవిని ఆటపట్టించారు. శ్రీదేవికి సింధూరం పెట్టడమే కాకుండా.. ఆమె వీపు మీద కుంకుమతో బోనీ కపూర్ పేరు రాశారు.. వాళ్లు అలా ఆటపట్టించడాన్ని శ్రీదేవి కూడా సంతోషంగా ఫీలయ్యింది. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతగా నవ్వుతూ తుళ్లుతూ ఆడిపాడిన సిరిమల్లెపువ్వుకు అప్పుడే నూరేళ్లు నిండాయంటే నమ్మగలమా.. 



మరింత సమాచారం తెలుసుకోండి: