ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని కొంత కాలంగా కేంద్రం మోసం చేయడంపై ఏపి ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కొంత కాలంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంతో ఫైట్ చేస్తున్నారు. భజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత ప్యాకేజీ అన్నారని, కానీ అది కూడా ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం అన్నారు.
జేఎఫ్సీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.విభజనకు ముందు తాను బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చానని, అందువల్ల నైతికంగా నేను ప్రజలకు ఇప్పుడు సమాధానం చెప్పవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. అందరూ తనను నిలదీస్తున్నారని చెప్పారు. ఏపీకి పదిహేనేళ్లు హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని, అది తాను నమ్మానని చెప్పారు. తాన తిరుపతి పర్యటనలో ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఓ పాచిపోయిన లడ్డూలతో సమానమని వ్యాఖ్యానించినట్టు తెలిపారు.
అపుడు టీడీపీ నేతలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం ఆ పాచిపోయిన లడ్డూలనే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కానీ, ఆ లడ్డూలను కూడా ఇంతవరకు రాలేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో తాను బీజేపీకి సహాయం చేశానని. ఎన్నికల్లో బీజేపీ గెలిచాక నిజంగా రాష్ట్రానికి న్యాయం చేస్తుందని గట్టిగా విశ్వసించానని చెప్పారు. కానీ, నాలుగేళ్ళు పూర్తయినా ఒక్క పని చేయకపోగా, పాచిపోయిన లడ్డూలు కూడా ఇంకా రాష్ట్రానికి రాలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.