తమిళనాడు లో ఎక్కడ చూసినా ఇప్పుడు కొత్త రాజకీయలపైనే చర్చలు నడుస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత అక్కడ రాజకీయంగా ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పన్నీరు సెల్వం వర్సెస్ శశికళ మద్య సీఎం పదవి కోసం పెద్ద యుద్దమే కొనసాగింది. అయితే శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడంతో...తెరపైకి పళని స్వామి ఎంట్రీ ఇచ్చాడు. అనూహ్యంగా పళని స్వామి సీఎం పీఠంపై కూర్చున్నారు.
ఇదిలా ఉంటే ఈ మద్య తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ లు కొత్త రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే కమల్ హాసన్ మక్కళ్ నీది మయ్యమ్ పార్టీ ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు తమిళ ప్రజల చూపు రజినీవైపు పడింది.. తలైవా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగు పెడుతున్నాడని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
తాజాగా చెన్నై నగరంలో పలుచోట్ల ఎంజీఆర్-రజనీకాంత్ భారీ ప్లెక్సీలు, హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. నగరంలో ఆయన విగ్రహాన్ని రజనీకాంత్ ఆవిష్కరించనున్న నేపథ్యంలో వారిద్దరితో కూడిన భారీ ప్లెక్సీలను పలు చోట్ల అభిమానులు ఏర్పాటు చేశారు. మరోవైపు భారీ ప్లెక్సీల ఏర్పాటు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుంది.
ఇలాంటి వాటి వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందిని కలిగిస్తుందని కోర్టు ఇదివరకే పేర్కొంది. ఎంజీఆర్ అంటే తమిళ ప్రజలకు ఎంతో ప్రేమ..ఆయన సీఎంగా ఉన్నపుడు ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ఆయన రాజకీయ వారసురాలిగా జయలలిత సీఎంగా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆమె మరణించిన తర్వాత అన్నాడీఎంకే లో ఎన్నో గొడవలు చెలరేగాయి. ప్రస్తుతం ఎంజీఆర్-రజనీ పోస్టర్లు వివాదాస్పదంగా మారాయి.