2019 తర్వాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నానని కేసీఆర్ తాజాగా ప్రకటించడం టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. అంటే 2019 ఎన్నికల్లో విజయం తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తేలిపోయింది. అయితే పార్టీలో బలంగా ఉన్న హరీశ్ రావు వంటి వారు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే చూస్తూ ఊరుకుంటారా లేక తిరుగుబాటు చేస్తారా అన్న కోణంలో ఊహాగానాలు సాగుతున్నాయి.
హరీష్ రావు చంద్రబాబులా తిరుగుబాటు చేస్తారని.. లేదా పార్టీ మారతారని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ.. హరీశ్ రావు దాన్ని ఖండించారు. తన ప్రాణం ఉన్నంతవరకూ టీఆర్ఎస్ లోనే ఉంటానన్నారు. మరి కేటీఆర్ క్యాబినెట్లో ఉంటే హరీశ్ , తుమ్మల వంటి సీనియర్లు కేటీఆర్ ను సక్రమంగా పని చేయనిస్తారా.. లేదా గ్రూపు రాజకీయాలు నడుపుతారా అన్న సందేహాలున్నాయి.
ఐతే.. దీనికి కేసీఆర్ ఓ విరుగుడు కనిపెట్టేశారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తూ.. సమర్థులను తనతో పాటు డిల్లీ తీసుకెళ్తానని ప్రకటించారు. అంటే హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్లను పార్లమెంటుకు పోటీ చేయించి ఢిల్లీకి తీసుకెళ్లాలన్నది కేసీఆర్ ప్లాన్ గా చెబుతున్నారు. ఈ విషయం తాజాగా కేసీఆర్ ప్రకటించారు కూడా.
అంటే అటు జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లినట్టు ఉంటుంది. ఇక్కడ కేటీఆర్ కు అడ్డంకి లేకుండా చేసినట్టూ ఉంటుంది. అంటే కొడుకుకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నమాట. కేసీఆర్ తాజా ప్రకటనతో హరీశ్ రావు, తుమ్మల వంటి వారు తలపట్టుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్ర రాజకీయాలు వదిలి ఢిల్లీకి వెళ్లాల్సివచ్చేందుకు వారు ఏమేరకు ఇష్టపడతారో మరి.