తాము అధికారంలో ఉండగా చిదంబరం గారి తీరు వర్ణనాతీతం. అధికార మదం, ఆహం, అహంకారం ఆయనలో అణువణువు పాదం నుండి తలవరకు ఎక్కి వుండేదని ఆయన గురించి తెలిసిన వారు అంటారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కుమారుడు, కార్తీ చిదంబ రాన్ని తీహార్ జైలుకు తరలించారు.
ఈ నెల 24 తేదీ వరకు కార్తీని 'జ్యుడీషియల్ కస్టడీ' కి తరలించాలని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పోలీసు కస్టడీ గడువు ముగిసిన తర్వాత, మరో 15 రోజుల కస్టడీ కోరిన సీబీఐ ప్రతిపాదనకు ప్రత్యేక న్యాయస్థానం అంగీకరించలేదు. అంతేకాదు కార్తీ 'ముందస్తు బెయిల్ పీటిషన్' ను కూడా తోసిపుచ్చింది.
అయితే భద్రతాకారణాల రీత్యా తనకు ప్రత్యేక జైలు గది కేటాయించాలని కార్తీ అభ్యర్థించారు. 1995లో బిస్కట్ బారన్ రాజన్ పిళ్ళై మరణించిన ఉదంతాన్ని గుర్తుచేసిన, కార్తీ చిదంబరం తాను అలా కావాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. తనకు ఏమైనా జరగవచ్చు అనే సందేహాలను వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తనకు ప్రత్యేకగది, బాత్-రూం కావాలని కార్తీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో పాటు ఇంటిలో వండిన ఆహారం, మందులు, కళ్లజోడు లాంటివి కావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక మంత్రిగా తన తండ్రి చిదంరబం పనిచేసిన సమయంలో ఉగ్రవాద కేసులను నిర్వహించారని ఆయన వాదించారు. అయితే మందులు, కళ్లజోడుకు అంగీకారం తెలిపిన కోర్టు మిగిలినవాటిని తోసి పుచ్చింది. ఆయన భద్రతకు ఢోకాలేదని చెప్పింది. ఈ సమయం లో మాజీ కేంద్రమంత్రి చిదంబరం కూడా కోర్టులో ఉన్నారు. జైలులో ఇంటి భోజనానికి అవకాశం ఇవ్వలేమని కూడా ప్రత్యేక న్యాయస్థానం తేల్చి చెప్పింది. మార్చి 15కార్తీ బెయిల్ పీటిషన్ను విచారించనున్నట్టు కూడా తెలిపింది.
కాగా యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రిగా పని చేసిన చిదంబరం అధికారం అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని, ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ నిధుల కోసం కుమారుడు కార్తీకి లాభం చేకూరేలా వ్యవహరించారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇంద్రాణీ ముఖర్జీ వాంగ్మూలం నేపథ్యంలో ఫిబ్రవరి 28న చెన్నై విమానాశ్రయంలో కార్తీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.