శ్రీదేవి హఠాన్మరణం ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీదేవి ఆకస్మిక మృతి తర్వాత ఆమెకు సంబంధించి అప్పటివరకూ రహస్యంగా ఉన్న విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె బంధువులు కొందరు మీడియా ముందు కామెంట్లు చేయడం అవి వివాదాస్పదం కావడం తెలిసిందే. ప్రత్యేకించి వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
బోనీ కపూర్ అప్పుల్ని శ్రీదేవి తన ఆస్తులు అమ్మి, తీర్చారని వేణుగోపాల్ రెడ్డి మీడియాకు చెప్పారు. శ్రీదేవి పైకి నవ్వుతూ ఉన్నా.. ఆమె గుండెల్లో చాలా బాధ ఉండేదని ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. శ్రీదేవి ఆస్తుల గురించి ఆమె చెల్లెలు శ్రీలత విషయంలోనూ శ్రీదేవి మరణం తర్వాత ఎన్నో వదంతలు వచ్చాయి. శ్రీదేవి ఆస్తిని ఆమె చెల్లి పరిహారం రూపంలో కొల్లగొట్టిందని కూడా కథనాలు వచ్చాయి.
ఎన్ని కథనాలు, ప్రచారాలు వచ్చినా ఇప్పటివరకూ శ్రీదేవి చెల్లి కుటుంబం నుంచి ఎవరూ మీడియా ముందు మాట్లాడలేదు. తాజాగా తొలిసారిగా శ్రీదేవి చెల్లెలు శ్రీలత భర్త సంజయ్ రామస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. వేణుగోపాల్ రెడ్డి ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను శ్రీలతను పెళ్లి చేసుకుని 28 ఏళ్లు అవుతోందని కానీ.. ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వేణుగోపాల్ రెడ్డి గురించి వినలేదని తెలిపారు.
శ్రీదేవి కుటుంబ సభ్యులమంతా ఇప్పుడు బాధలో ఉన్నామని.. ఇలాంటి సమయంలో వివాదాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే తాను ఇంతవరకూ ఏం మాట్లాడలేదని తన మౌనానికి వివరణ ఇచ్చారు. వేణుగోపాల్ రెడ్డి చెప్పిన మాటల్లో మాత్రం నిజం లేదన్న సంజయ్ రామస్వామి.. ఈ కష్ట సమయంలో కుటుంబం మొత్తం బోనీ కపూర్కు మద్దతుగా ఉన్నామని ప్రకటించారు.