పవర్ స్టార్ అనిపించాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ రథం గేర్ అతి తేలిగ్గా మార్చేశారు. ఇంతకాలం తెలుగు దేశం పార్టీకి ఏ ఇబ్బంది వచ్చినా కొండంత అండగా ఉంటూ వచ్చిన ఈ జనసేనాని, మొదటిసారి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై, ఆయన కుమారుడు ఐటి మంత్రి వర్యులు లోకేశ్పై సంచలన ఆరోపణలు చేశారు.
ఆంధ్రపదేశ్ అవినీతిలో అగ్రస్థానంలో ఉందన్న పవన్ కళ్యాణ్, లోకేశ్ అవినీతి గురించి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే లోకేశ్ పై జనసేన అధినేత చేసిన ఈ ఆరోపణలు ఏపి ప్రజావళిలో ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. అటు ఇసుక మాఫియా లో, ఇటు దుర్గగుడి పార్కింగ్ లో ఒక చోటేమిటి అన్నింటా సర్వాంతర్యామిలా అన్నీ పాపాల్లో తెలుగు దేశం పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు తమ వాటాలు పంచేసుకుంటున్నారని తూర్పార బట్టారు.
ఇక కేంద్ర ప్రభుత్వంపై ఎక్కడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావన లేకుండా మండిపడ్డారు. ప్రశ్నించడానికే ఉద్భవించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నాలుగవ ఆవిర్భావ దినోత్సవం వేదికగా, తాను రాష్ట్రంలో గెలిపించిన తెలుగు దేశం పార్టీ లక్ష్యం చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తూ విరుచుకుపడ్డారు. 2019ఎన్నికలు టీడీపీకి 2014లో ఉన్నంత సునాయాసంగా మాత్రం ఉండబోవని ఖచ్చితంగా ఆయాసం తెచ్చిపెడతాయని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి ప్రభుత్వం కొనసాగిస్తున్న అవినీతితో ప్రజలు భీతిల్లుతున్నారని వారిలో తీరని భయం ఏర్పడిందన్నారు.
దేశంలో ఎక్కడా లేనంత అవినీతి రాజధాని అమరావతిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో పునాదుల నుండే ఊపిరి పోసుకుందని అవినీతి పరుల్ని తరిమి తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు జనసేనాని. 2019ఎన్నికల్లో ప్రజలు కొత్త పార్టీని, కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు అంటూ "జనసేన ఉంది జనం కోసమే" నని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అంటే మనవాళ్ళకు భయం, దోపిడి లంచగొండితనం భూకబ్జాలు చేసే వారిలో పిరికితనం ఉంటుందన్నారు. "సెంటిమెంట్ తో ప్రత్యేక హోదా" ఇవ్వలేమన్న కేంద్రం — ఏ సెంటిమెంట్ తో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని ప్రశ్నించారు? అని అంటూ మీ ప్రకటన మా గుండెలను పిండేస్తుంది, విభజన హామీతో ఏపీకి న్యాయం జరగలేదు. నాలుగేళ్ల నుంచి ఏపీకి జరుగుతున్న అన్యాయం భాధిస్తోంది. వినిపిస్తోందా జైట్లీగారు?` అంటూ 2016లోనే ప్రకటించిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పై 2018లో విరుచుకుపడ్డారు. దీని భావమేమి పవన కళ్యాణా? అంటున్నారు జనం.
కానీ తనతో కలిసి టిడిపి గెలుపు కోసం ప్రచారం చేసిన దేశనాయకుడు, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చిన్న మాట కూడా అనకపోవడం జనానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే జనం మాత్రం జగన్ దెబ్బకు — ఆయన టిడిపితో స్నేహం దెబ్బకు ఠా! అన్నట్లు మాయమైపోయిందని- ఒక వేళ ఉత్తరం దక్షిణం అనే బేధం లేకుండా భారత్ అంతటా బలహీన పడుతున్న బిజెపి ప్రభుత్వం, జగన్ స్నేహంతో "ప్రత్యేక హోదా ఇస్తే ఆ క్రెడిట్ లో వాటా కోసం" తహ తహ లాడుతున్నట్లుందని అంటున్నారు.