మంగళగిరి సభలో పవన్ కల్యాణ్ టీడీపీనే టార్గెట్ చేశారు. ప్రత్యేకించి చంద్రబాబు, లోకేశ్ ను లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అవినీతిపరులు, తప్పు చేసిన వారికి సీబీఐని వదులుతారని భయం ఉండొచ్చు కానీ తమకు కేంద్రం అంటే భయం లేదన్నారు. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుందంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. తాను చంద్రబాబు అనుభవం చూసే మొదట్లో సపోర్ట్ చేశానన్నారు.
నాలుగేళ్లలో తెలుగుదేశం మాట్లాడిన మూడు మాటల్లో ఆరు అబద్ధాలు వినిపిస్తున్నాయన్నారు పవన్. ఏపీ పునర్నిర్మాణం కోసం టీడీపీకి మద్దతిచ్చా.. ఆ పార్టీ పునర్నిర్మాణానికి కాదన్నారు పవన్. సీఎంను కలిసినప్పుడు రాజధాని నిర్మాణానికి 1500-2000 ఎకరాలు చాలన్నారు.. కానీ ఇప్పుడు రాజధానికి 33వేల ఎకరాలు అంటున్నారని విమర్శించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. "అందరికీ అభివృద్ధి కోసం టీడీపీ ఏమీ చేయట్లేదపిస్తోంది..అభివృద్ధి కేవలం రాజధాని చుట్టూ కేంద్రీకృతం అయితే ఎలా?.. రాత్రికి రాత్రే చీకటి ఒప్పందాలు చేసుకుని ప్యాకేజీకి ఒప్పుకున్నారు.. ఏపీకి ఇచ్చిన ప్యాకేజీ బాగుందన్నారు, మళ్లీ చట్టబద్ధత కల్పించలేదన్నారు.. ప్రజల నిశ్శబ్దాన్ని అసమర్థతగా భావించవద్దు..ఏపీకి ప్రత్యేకహోదా కావాలని ఇప్పుడు అనటం ఎందుకు.. అప్పుడే చెప్పవచ్చుగా?"
"రాజధానిపై సీఎం భావోద్వేగం చెందారు.. గుంటూరులో కలరా మృతులపై ఎందుకు భావోద్వేగం రాలేదు?.. ఈ రోజు అవినీతి ఆంధ్రప్రదేశ్గా ప్రభుత్వం మార్చి వేసింది.. 2019లో మేం మీకు ఎందుకు సపోర్టు చేయాలి? మీరు దోపిడీ చేయటానికా మేం మద్దతు ఇచ్చింది? సీఎంకి యంత్రాంగంపై పట్టు లేదా.. లేక తెలిసే అవినీతి జరుగుతోందా? 2019 ఎన్నికలు 2014 అంత సుఖంగా అయితే తెదేపాకు ఉండవు.. అమరావతి రైతుల దగ్గర్నుంచి ఎవరూ ప్రభుత్వం పట్ల సంతోషంగా లేరు.. ఈరోజు నుంచి తెలుగుదేశం వైఫల్యాలను ఎండగడతాం.. తెలుగుదేశం ప్రభుత్వంతో స్నేహం చేయను..ఎదురే తిరుగుతాను"