మంగళగిరి సభలో పవన్ కల్యాణ్ టీడీపీని టార్గెట్ చేయడంతో ఆ పార్టీ ఎదురుదాడి ఆరంభించింది. ప్రత్యేకించి పవన్ చంద్రబాబు, లోకేశ్ ను లక్ష్యంగా విమర్శలు గుప్పించడంపై చంద్రబాబు అండ్ కో మండిపడుతున్నారు. ఇదంతా బీజేపీ చేస్తున్న మహా కుట్రగా ఆ పార్టీ వర్ణించే ప్రయత్నం చేస్తోంది. గురువారం ఉదయమే పవన్ వ్యాఖ్యలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పవన్ పై ఘాటుగా విరుచుకుపడ్డారు.
పవన్ కళ్యాణ్ ఆరోపణలు అర్ధరహితం,ఆధార రహితమన్న చంద్రబాబు గతంలో వైసీపీ చేసిన పసలేని విమర్శలే ఇప్పుడు పవన్ చేస్తున్నారన్నారు. 2013నివేదిక పట్టుకుని అవినీతి రాష్ట్రం అనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. నిన్నటివరకూ తనపై జగన్,విజయసాయిలతో డ్రామా ఆడారని.. ఇప్పుడు అది వికటించేసరికి ఇప్పుడీ కొత్త డ్రామా ప్రారంభించారని బీజేపీని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.
తమిళనాడు తరహా డ్రామాలు ఇక్కడ నడవబోవని బీజేపీని చంద్రబాబు హెచ్చరించారు. ఈ నాటకాల స్క్రిప్ట్ లు ఎక్కడనుంచి వచ్చాయో అందరికీ తెలిసిందేనని.. ఎవరెవరు ఎన్ని నాటకాలు ఆడతారో ఆడనివ్వండన్న చంద్రబాబు చివరకు ప్రజలే సరైన తీర్పు ఇస్తారన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన కీలక సమయంలో ఇటువంటి విమర్శలు చేయడమేంటన్నారు.
టిడిపిని బలహీనపరచడం వల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అని విమర్శించారు. ఇదంతా ఓ కుట్రలో భాగంగా జరుగుతోందన్నారు. ఆ కుట్రలో భాగంగానే తనపై లోకేష్ పై నిందలు వేస్తున్నారని దీన్ని జనం అర్థం చేసుకుంటారని చంద్రబాబు చెప్పకొచ్చారు.