అనర్హత వేటుపడ్డ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ కుమార్ల ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై హైకోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది రవిశంకర్ జంధ్యాల తన వాదనలు వినిపించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన చాలాసేపటి వరకు తెలంగాణా శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ బాగానే ఉన్నారు. తరవాత ఆయన ఆస్పత్రిలో ఎందుకు ప్రత్యక్షమయ్యారో అర్థం కావడం లేదన్నారు. ఈ నెల12న కేవలం గవర్నర్ ఈ.ఎస్ ఎల్ నరసింహన్ ప్రసంగం మాత్రమే జరిగిందని, 13న శాసనసభ ప్రారంభ మైందని తెలిపారు.
గవర్నర్ ప్రసంగం రోజు సభలో ఎలాంటి దాడి జరగలేదని, ఎమ్మెల్యే ల సభ్యత్వం రద్దు చేయడం చట్టవిరుద్దమని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే నేతల సభ్యత్వం రద్దు చేశారని న్యాయవాది వివరించారు. ప్రొసీడింగ్ సరిగా జరగలేదని, సభ్యుల వివరణ తీసుకోకుండానే తమపై చర్య తీసుకున్నారని న్యాయస్థానానికి నేతలు విన్న వించారు. తమకు ఎన్నో అనుమానాలు న్నాయని, సీసీ ఫుటేజీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
అయితే దీనిపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఏకపక్ష నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎలాంటి దాడి జరగలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా మండలి చైర్మన్ బాగానే ఉన్నారని, తర్వాత చాలా సేపటికి ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారని పిటీషన్లో తెలిపారు.
ఎమ్మెల్యే సంపత్ వీడియోలో లేకపోయినా చర్యలు తీసుకున్నారని, సభ్యత్వం రద్దు పై ఎథిక్స్, ప్రివిలేజ్ కమిటీలు సిఫార్సు చేయలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే సభ్యత్వాలు రద్దు చేశారని పిటిషనర్లు తమ వేదనను వెలిబుచ్చారు. శాసనసభ కార్యదర్శి ఇచ్చిన "గెజిట్ నోటిఫికేషన్" ను కూడా రద్దు చేయాలని, పూర్తి ఫుటేజీ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోమటిరెడ్డి వెంటకరెడ్డి, సంపత్ లు కోరారు.
ప్రభుత్వం తన అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి ద్వారా కౌంటర్ దాఖలుకు సమయం కోరింది. దానికి అంగీకరించిన హైకోర్ట్ సోమవారం వరకు గడువు కోరారు. ఈ కేసుపై విచారణ సోమవారానికి వాయిదా కోర్టు వేసింది.