రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. దీనికి ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తారతమ్యం కూడా లేదు. నిన్నటి వరకు దణ్ణాలు పెట్టుకున్న చేతులతోనే కత్తులు నూరుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇదే తరహా రాజకీయానికి ఏపీలో టీడీపీ-బీజేపీలు తెరదీశాయి. ఏపీ విభజన చట్టంలోని హామీలు సహా ప్రత్యేక హోదా పై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున సాగుతున్న ప్రస్తుత ఉద్యమం మరో ఏడాదిలో ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో కీలక పరిణామాల దిశగా దూసుకుపోతోం ది. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పట్టు సాధించేందుకు టీడీపీ, టీడీపీకి పుట్టగతులు లేకుండా చేసేం దుకు బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం తాజాగా ఏపీలో అమలు చేయాలని భావిస్తున్న త్రిపుర రాష్ట్ర ఎన్నికల వ్యూహాన్ని తెరమీదికి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో బీజేపీ సరికొత్త వ్యూహం అమలు చేసింది. పార్టీని ఏక తాటిపై నడిపిస్తూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వారిని చేరదీ సింది. పదవుల పందేరంతో అందరిలోనూ ఆశలు రేపింది. ఫలితంగా దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ మట్టికొట్టుకుపోయింది. ఇదే తరహా వ్యూహం ఇప్పుడు ఏపీలోనూ అమలు చేసి, చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ నాయకులుగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, ఎంపీ గంగరాజు, మాజీ మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్రాజు, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, పార్టీ నేతలు పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలను తక్షణమే ఢిల్లీకి రావాలంటూ బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు అందినట్టు సమాచారం. వీరంతా ఈ రోజు(శనివారం) ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే రాబోయే ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఎలా ఉండాలి? చంద్రబాబు ఎదురు దాడికి ఎలా కళ్లెం వేయాలి? వంటి కీలక అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.
కాగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జిగా ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్థానంలో రాం మాధవ్ను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాం మాధవ్ అయితే, త్రిపురలో మాదిరిగా పార్టీని ఏపీలో బలోపేతం చేస్తారని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ వ్యూహం ఫలిస్తే.. చంద్రబాబు పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు తనకు అండగా ఉంటాడని, తనతో కలిసి వస్తాడని, వచ్చే ఎన్నికల్లో తనకు జై కొడతాడని భావించిన పవన్ ఇప్పటికే మాటమార్చడంతో బాబు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇలా గోరు చుట్టుగా ఉన్న తన పరిస్థితిపై కేంద్రం మరోసారి రోకలి పోటులా వ్యవహరిస్తే.. అధికారంలోకి రావడం కలగానే మిగిలేలా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.