రాం మాధవ్ త్రిపురలో రధ గజ తురగ పదాతి దళాల సమీకరణ నుండి పట్టాభిషేకం వరకు బాజపా రాజకీయ రధాన్ని ముందుంది నడిపించారు. అదే ఉత్సాహంతో ఆంధ్ర ప్రదేశ్ బాజపా నాయకత్వానికి తోడు నిల్చి దిశానిర్దేశం చేస్తూ విజయాల తీరం చేరుస్తారా?
ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి ప్రతిపక్షంగా తమ బాధ్యతలు నిర్వహించే లక్ష్యంగా మా కార్యవర్గ సమావేశాలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు తెలిపారు. కాషాయ పార్టీ తో టీడీపీ తెగదెంపులు చేసుకొని ఎన్డీయే నుంచి వెలపలకు వచ్చిన నేపథ్యంలో బీజేపీ నేతలు ఢిల్లీలో కీలక భేటీ జరిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో, నేడు అంటే (మార్చి 17) జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కే చెందిన "బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్" తో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, పురందేశ్వరీ, సోము వీర్రాజు, కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, జీ సతీష్, విష్ణుకుమార్ రాజు తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై అమిత్ షా తీవ్ర అసహనం, అభ్యంతరం వ్యక్తం చేసినట్లు, బిజేపీపై ఆరోపణలు చేయడమే కాకుండా ఏకంగా కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు చంద్రబాబు సిద్ధపడటంతో ఇక ఆ పార్టీ విషయంలో దూకుడుగా ముందుకెళ్లాలని, చంద్రబాబు పాలనలోని అవకతవకలను టార్గెట్ చేయాలని బీజేపీ నేతలు అందరూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై అవగాహనా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కంభంపాటి హరిబాబు తెలిపారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో భావో ద్వేగాలు ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ కలసి లేదా విడివిడిగా ప్రజల్లో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాకు ఏమాత్రం తగ్గకుండా ఏపీకి సంపూర్ణ ఆర్థిక ప్రయోజనం కలిగేలా చేస్తామని బిజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్లు హరిబాబు మీడియాకు తెలిపారు.
" ఏపి విభజన చట్టంలోని చాలా అంశాలను పరిష్కరించాం. చట్టంలో పేర్కొన్నవిధంగా పలు సంస్థలను మూడున్నరేళ్లలో ఏర్పాటు చేశాం. పోలవరం ప్రాజెక్టుకు సాయం అందించాం. మిగిలిన అంశాలకు కూడా త్వరలోనే పరిష్కరిస్తాం" అని హరిబాబు తెలిపారు. ఇక్కడ కొత్తగా పరిశ్రమలు స్థాపించేవారికి 15 శాతం పన్ను రాయితీ, 15 శాతం అదనపు పారిశ్రామిక ఆర్ధిక సహకారం (ఇండస్ట్రియల్ అలవెన్సు) కేంద్రం నుంచి అందించినట్లు హరిబాబు తెలిపారు. గత బడ్జెట్లోనూ పరిశ్రమలు పెట్టే వారికి ₹ 100 కోట్ల వరకు వడ్డీ రాయితీ ఇచ్చామని, కానీ ఆ డబ్బును చంద్రబాబు ప్రభుత్వం ఖర్చుపెట్టలేదని అన్నారు.
ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర అధినేత చంద్రబాబు కంటే ఎక్కువగా తామే బాధ్యత తో పనిచేస్తున్నామని మీడియాకు తెలిపారు. "అభివృద్ధికి ఇప్పటి దాకా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం, అది ఇక ముందూ కొనసాగుతుంది" అని రాంమాధవ్ సుస్పష్ఠం చేశారు. "ఇప్పటివరకు టీడీపీతో కలిసిపనిచేశాం. ఇప్పుడు టిడిపి తమను వ్యతిరేకులుగా మార్చింది. అది మేం చేసింది కాదు. వారి స్వయంకృతాపరాధం" అని రాంమాధవ్ అన్నారు.
ఇప్పటివరకూ మిత్రపక్షంగా కార్యవర్గ సమావేశాలు జరిగాయని, ఇకపై ప్రతిపక్షంగా అవి జరుగుతాయి" అని మరో రాష్ట్ర నేత సోము వీర్రాజు తెలిపారు. మొత్తం మీద తమ పార్టీ ప్రజా పక్షం వహిస్తుందని అని ఆయన చెప్పారు. సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీకి కూడా ఈయన రాజకీయ వ్యూహకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ఈ అంశం కూడా రాజకీయవర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.