ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల్లో వారసుల హడావిడి, హంగామా ఓ రేంజ్లో ఉండనుంది. మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా అధికార టీడీపీలో పలువురు సీనియర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వారసులను పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు ఇప్పటి నుంచే రకరకాల కష్టాలు, ప్లాన్లు వేసుకుంటున్నారు. కొందరు తాము పోటీ చేయడంతో పాటు తమ వారసులకు కూడా సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. జేసీ లాంటి వాళ్లు తమ కుమారుల కోసం తమ సీటును అయినా త్యాగం చేసి మరీ వాళ్లను పోటీ చేయించాలని చూస్తున్నారు.
సీనియర్ల ఆశలు ఎలా ఉన్నా అధికార టీడీపీ నుంచి టిక్కెట్ల కోసం టఫ్ కాంపిటేషన్ ఉండడంతో అటు తండ్రులకు, ఇటు వారసులకు టిక్కెట్లు వస్తాయా ? అన్నది మాత్రం సస్పెన్సే. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు, సీమ జిల్లాల వరకు చూస్తే చాలా మంది సీనియర్లు వారసులకు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు, లాబీయింగ్లు, కొంతమంది సిట్టింగ్లకు ఎర్త్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సరే ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా గుంటూరు జిల్లాకు చెందిన తలపండిన రాజకీయ వేత్త, సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు కూడా తన వారసుడు రాయపాటి రంగారావును వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు.
రాయపాటి ప్రస్తుతం నరసారావుపేట ఎంపీగా ఉన్నారు. టీడీపీలో ప్రస్తుతం పదవుల కోసం ఉన్న పోటీ నేపథ్యంలో ఆయన చిరకాల కోరిక ఆయన టీటీడీ చైర్మన్ పదవి వస్తుందా ? రాదా ? అన్నది సస్పెన్సే. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా ? లేదా ? అన్నది కూడా చూడాలి. ఇక చంద్రబాబు మాత్రం రాయపాటి వారసుడిని రంగంలోకి దించాలని నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రంగారావు పశ్చిమగోదావరి జిల్లాలో కూడా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు.
పార్టీ కార్యకలాపాలతో పాటు తన తండ్రికి నరసారావుపేట సెగ్మెంట్లో అన్ని విధాలా చేదోడు వాదుడుగా ఉంటున్నారు. చంద్రబాబు రాయపాటి ఫ్యామిలీలో ఇద్దరికి సీట్లు సర్దుబాటు చేయడం కష్టం అనుకుంటే వారసుడి కోసం రాయపాటి సీటు త్యాగం చేయకతప్పదు. రాయపాటి ఫ్యామిలీకి సుదీర్ఘమైన అనుబంధం ఉన్న గుంటూరులో జయదేవ్ ఉన్నాడు. రంగారావు ఎంపీగా వెళ్లాలనుకుంటే తండ్రి వదులుకున్న సీటు నరసారావుపేట నుంచే పోటీ చేయాలి.
ఇక సమీకరణలు మారి ఆయన్ను అసెంబ్లీ బరిలో దింపాలనుకుంటే నగరంలోని గుంటూరు వెస్ట్, మంగళగిరితో పాటు రాయపాటి సొంత నియోజకవర్గం పెదకూరపాడుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నరసారావుపేటకు మారితే ఆయన ప్రస్తుతం ఉన్న సత్తెనపల్లి సీటును అయినా కేటాయించే ఛాన్సులు ఉన్నాయి. ప్రస్తుత గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగల వేణుగోపాల్రెడ్డిని మారిస్తే అక్కడ లేదా పార్టీ అనాథలా ఉన్న మంగళగిరి నుంచి అయినా రంగారావును బరిలోకి దింపే ఆలోచన అధిష్టానం వద్ద ఉంది. మరి రాయపాటి వారసుడికి తండ్రి త్యాగం చేస్తే ఎంపీ సీటు వస్తుందా ? లేదా ? అసెంబ్లీ బరిలో ఉంటాడా ? అన్నది చూడాలి.