ఏపీ ప్రతిపక్షనేత జగన్ చిరకాల వాంఛ ఏంటో అందరికీ తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి.. అంతేనా.. ఏకబిగిన 30 ఏళ్లు పరిపాలించాలి.. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకున్నట్టు.. రేపు జనం జగన్ ఫోటో కూడా పెట్టుకోవాలి..ఇదీ జగన్ కోరిక.. ఈ విషయం ఎన్నోసార్లు ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు.
సీఎం కుర్చీపై ఉన్న ప్రేమను జగన్ ఎప్పుడూ దాచుకోరు.. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఏమాత్రం ఆలోచించరు. కానీ.. ఈ ఉగాది రోజుల పంచాంగ కర్తలు చెప్పిన జ్యోతిష్యం వింటే ఆయన కోరిక నెరవేరదేమో అనిపిస్తోంది. సీఎం సీట్లో కూర్చోవాలన్న కోరిక నెరవేరినా.. ఏకబిగిన 30 ఏళ్లు పాలించాలన్నది మాత్రం తీరేటట్టు కనిపించడం
లేదు.
ఎందుకంటే జ్యోతిష్యుడు ఆయన 12 ఏళ్ల 8 నెలల 18 రోజులు అధికారంలో ఉంటారని లెక్కలు గట్టి మరీ చెప్పారు. అంటే ఆయన 30 ఏళ్ల పాలన కల పూర్తికానట్టేనా.. లేక రెండు విడతలుగా అధికారంలోకి వస్తారా.. అన్నది కాలమే తేల్చాలి. అంతే కాదు.. జగన్ జాతకంపై తాము కట్టిన లెక్కలపై జ్యోతిష్యులు సవాల్ కూడా విసురుతున్నారు.
సాధారణంగా ఉగాది పంచాంగ శ్రవణంలో ఏ పార్టీకి అనుకూలంగా జాతకాలు, జ్యోతిష్యం చెప్పడం ఆనవాయితీ.. కానీ ఈసారి మాత్రం ముఖస్తుతి కోసం చెప్పడం లేదంటున్నారు జగన్ జాతకం చెప్పిన జ్యోతిష్యులు. తానొక్కడే కాదని.. 40 మంది పంచాంగకర్తలం కలిసి కూర్చొని జగన్ భవిష్యత్తును అంచనా వేశామంటున్నారు. ఈ అంచనాలు తప్పయితే జీవితంలో పంచాంగ శ్రవణం చేయబోనని సదరు జ్యోతిష్యులు సవాల్ విసిరారు.