ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ టీడీపీ, చంద్రబాబును తీవ్రస్థాయిలో టార్గెట్ చేయడం, ఇటు టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి పదవులు వదులుకోవడం, ఏపీ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేయడంతో ఇక్కడ వాతావరణం ఓ రేంజ్లో హీటెక్కింది. ఇక ఇప్పుడు ఒకేసారి అటు అధికార టీడీపీతో పాటు ఇటు విపక్ష వైసీపీ ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై ఒకేసారి అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఇక గుంటూరు సభలో పవన్ టీడీపీని దారుణంగా టార్గెట్ చేసేశారు. ఆ తర్వాత పవన్పై టీడీపీ ఓ రేంజ్లో విమర్శలు చేస్తోంది. పవన్ బీజేపీ చెప్పినట్టు ఆడుతున్నాడని చంద్రబాబుతో పాటు టీడీపీ వాళ్లంతా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేస్తుంటే ఆ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఢిల్లీలో మోడీతో పాటు బీజేపీ పెద్దలను పదే పదే కలుస్తున్నాడు.
దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు ఎవరితో జట్టు కడతారో ? కూడా అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే ఏపీలో ఓ వైపు రాజకీయ వాతావరణం హీటెక్కితే మారిన నేపథ్యంలో ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎన్డీయేతో తెంచుకోవడం వల్ల టీడీపీకి లాభమా? బీజేపీకి లాభమా? జనసేనాని ఒంటరిగా పోటీ చేస్తారా? జగన్ బీజేపీతో కలుస్తాడా ? అన్న ప్రశ్నలు ఏపీ జనాల మదిని తెగ తొలచి వేస్తున్నాయి. ఇక ఇదే విషయాలపై ఐబీ, ఇంటెలిజెన్స్ పలు అంశాలపై ఆరాలు తీస్తున్నట్టు తెలుస్తోంది.
పవన్ చంద్రబాబుతో పాటు లోకేశ్ అవినీతిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వ్యాఖ్యల్లో ఎవరెవరిలో పాజిటివ్ నెస్ ఉంది ? ఎవరిలో నెగిటివ్ చాయలు ఉన్నాయన్నదానిపై కూడా సర్వేల్లో ప్రశ్నలు అడుతున్నారు. పవన్ హఠాత్తుగా యూ టర్న్ తీసుకోవడం వెనక ఎవరెవరు ? ఉన్నారన్న కోణంలో కూడా కూడా సర్వేల్లో ఆరాలు తీస్తున్నారు. ఇక పవన్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన వెంటనే చంద్రబాబు ఎన్డీయేకు కటిఫ్ చెప్పేశారు.
ఇక ఈ అంశాలతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో జట్టు కడుతారు ? ఎవరు ఎవరితో వెళితే ఎవరికి లాభం అన్న అంశంపై కూడా సర్వేలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై ఇంటిలిజెన్స్ వాళ్లతో పాటు అటు పీకే టీం, ఇటు టీవీ ఛానెల్స్ వాళ్లు, కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు కూడా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఏదేమైనా ఏపీలో ప్రస్తుతం పొలిటికల్ సర్వేల హీట్ నడుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొందరు నేతలు తమ తమ ప్రాంతంలో ప్రయివేటుగా సర్వేలు చేయించుకుంటున్నారట.