ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. కష్టకాలంలో కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన జిల్లాలో రోజుకో సమస్యతో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీని, నాయకులను ఉక్కిరి బిక్కరి చేస్తున్నాయి. అధికార పార్టీ నుంచి వరుసగా ప్రజాప్రతినిధుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల కరీంనగర్ గ్రేటర్ మున్సిపాలిటీ లో ఇద్దరు మహిళా ప్రజాప్రతిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ గొడవ ముగిసేలోపే తాజాగా సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పావని చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతోంది. ఈ వివాదంలోకి ఏకంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను లాగడంపై టీఆర్ఎస్ పార్టీలో దుమారం రేగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పలుమార్లు అసెంబ్లీ సాక్షిగా అవినీతిని సహించేదిలేదని.. తాము కడుపుకట్టుకుని.. ఎలాంటి అవినీతికి ఛాన్స్ లేకుండా పనిచేస్తున్నామని ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనకు భిన్నంగా స్వయంగా సీఎం కెసీఆర్ తనయుడు, మంత్రి కెటీఆర్ నియోజకవర్గానికి చెందిన మాజీ మునిసిపల్ ఛైర్ పర్సన్ పావని చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేశాయి.
మంత్రి కెటీఆర్ కు కూడా కమీషన్ల విషయం తెలుసని..ఈ కమిషన్ల వ్యవహారం రాష్ట్రమంతటా ఉందని పావని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీంతో ఇరకాటంలో పడిన సర్కారు వెంటనే ఆమెను పదవి నుంచి తప్పించింది. విపక్షాలు ఇఫ్పటికే మిషన్ భగరధ నుంచి మొదలుకుని సాగునీటి ప్రాజెక్టులు,,విద్యుత్ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వారి ఆరోపణలకు పావని వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చిపెట్టాయి. దీన్ని ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ ఓ అస్త్రంగా వాడుకునేందుకు రెడీ అయింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ అంశంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.
కేటీఆర్ అవినీతికి సంబంధించి సాక్ష్యాలు కూడా దొరికినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో సీఎం కేసీఆర్ చెప్పాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. దళితుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య అవినీతికి పాల్పడ్డారంటూ.. ఏం చేశారో కూడా చెప్పకుండానే పదవి నుంచి తొలగించారని పేర్కొన్నారు. రాజయ్యకో నీతి, మంత్రి కేటీఆర్కు మరో నీతి వర్తింపజేస్తారా? అంటూ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన మునిసిపల్ చైర్పర్సన్ పావని.. మీడియా ప్రతినిధుల ఎదుట మాట్లాడిన మాటల్లో అనేక వాస్తవాలు ఉన్నాయన్నారు.
తన గుట్టురట్టవుతున్న విషయాన్ని గుర్తించిన కేటీఆర్.. ఆమెతో పదవికి రాజీనామా చేయించారని ఆరోపించారు. కమీషన్లు తీసుకోవాలని కౌన్సిలర్లు, చైర్పర్సన్లకు సూచించిన కేటీఆర్.. తనవంతు పర్సంటేజీలను తీసుకోకుండా ఉంటారని ఎలా నమ్మమంటారో చెప్పాలన్నారు. ఈ పర్సంటేజీల వ్యవహారం మంత్రి కనుసన్నల్లోనే జరుగుతోందనే విషయం కూడా పావని బయటపెట్టినా సీఎం పట్టించుకోవడంలేదన్నారు. ఈ వ్యవహారంపై తాను ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు తెెలుస్తోంది.