ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం కేంద్రంపై వైసీపీ టీడీపీ ఎంపీలు పార్లమెంటు వెలుపల లోపల కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు చిత్తూరు ఎంపి శివప్రసాద్. రకరకాల వేషధారణలతో పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు.   

 బిజెపి టిడిపి పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తరువాత మోడీపై పదునైన విమర్శలు చేస్తున్నారు శివప్రసాద్. మోడీ పతనం ప్రారంభమైందని మండిపడ్డారు శివప్రసాద్. నేడు ఆయన పార్లమెంట్ కి మద్య వయసు గల  మహిళగా వేషధారణలో వచ్చారు.   ఎపి మహిళందరూ మోడీ అన్నా ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తావన్నా అంటూ అడుగుతున్నారు. మీరెందుకు ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నించారు. అన్నా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాకి రా.. మా బాధల్ని చూడు అంటూ శివప్రసాద్ వినూత్నంగా నినాదాలు చేస్తూ పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు.

ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉద్యమిస్తారని జాడించి కొడితే ఎక్కడో పోయి పడతావని ప్రధాని మోదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``నువ్వు ఈ దేశానికి తగవు. చంద్రబాబులాంటి లీడర్ కు ద్రోహం చేస్తే ఇంకెక్కడ ఉంటావు?' అని మోదీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.  ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఎంపీ శివప్రసాద్ వేసిన వేషధారణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు రాజకీయాల్లో కమల్ హాసన్ గా కొందరు శివప్రసాద్ ను అభివర్ణిస్తూ ఆయన `గెటప్స్` గురించి చర్చించుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: