ఏపీకి ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న ఏపీ అధికార, విపక్ష పార్టీలు టీడీపీ, వైసీపీలు కేంద్రంలో కదం తొక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రంపై తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం చేస్తున్నాయి. ఏపీకి ద్రోహం చేశారని, ఏపీని అన్యాయం చేశారని, ఇలా పెద్ద ఎత్తున కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, ఈ క్రమంలోనే అత్యంత బలిష్టమైన, పదునైన అవిశ్వాస తీర్మానం నోటీసులు కూడా ఇచ్చారు.
దీని ద్వారా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును ఇరకాటంలోకి నెట్టాలని, తద్వారా ఏపీ సమస్యలపై పార్లమెంటులో చర్చించుకునే అవకాశం మరోసారి లభిస్తుందని, దీనివల్ల జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీని బద్నాం చేయొచ్చని కూడా పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగు రోజులుగా పార్లమెంటు ఇదే విషయంపై అట్టుడుకుతోంది.
అయితే, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ లోక్సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చర్చకు చేపట్టడమంటే ఆషామాషీ కాదనీ, మిగతా తీర్మానాలతో పోలిస్తే అదెంతో భిన్నమైనదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నా రు. ఏపీకి జరిగిన అన్యాయం విషయంలో టీడీపీ, వైసీపీ సమర్పించిన అవిశ్వాస తీర్మానాల నేపథ్యంలో వీరి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. తీర్మానాన్ని చర్చకు పెట్టకుండా వదిలేయడానికి సభలో గందరగోళం ఒక అడ్డంకి కాదని తెలుస్తోంది. సభ ప్రశాంతంగా లేకపోయినా నోటీసు సక్రమంగా ఉంటే చాలనీ, తీర్మానాన్ని చర్చించవచ్చనీ సమాచారం.
ఇక, ‘అవిశ్వాస తీర్మానాలను మిగతావాటి మాదిరిగా అనుమతించలేం. ఇది ప్రత్యేక ప్రస్తావన. స్పీకర్ కేవలం ఆ నోటీసు గురించి సభ్యులకు తెలియపరుస్తారు. నిబంధనల ప్రకారం పత్రాలన్నీ ఉంటే ఆ తీర్మానం విషయంలో ఆమె ముందుకు వెళ్తారు. తీర్మానానికి మద్దతుగా 50 మంది సభ్యులు నిల్చొంటే చర్చకు తేదీ, సమయాన్ని మాత్రం సభాపతి నిర్ణయిస్తారు’ అని అంటున్నారు. అయితే, సభలో గందరగోళం కొనసాగితే.. అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపట్టడంలో ఆచరణాత్మక ఇబ్బందు లుంటాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
‘సభ్యులు తమ స్థానాల్లోనూ, సభాపతి స్థానం ముందు నిల్చొంటే తీర్మానానికి మద్దతునిస్తున్న 50 మంది ఎవరనేది లెక్కించడం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ లెక్కకి ఓటింగ్ ఏమీ ఉండదు, కేవలం సభ్యుల్ని లెక్కించడమే’ అని అంటున్నారు. అవిశ్వాసం సహా ఏ అంశాన్ని చర్చించాలన్నా సభ ఒక పద్ధతిలో ఉండాలని కూడా చెబుతున్నారు. మరి దీనిని బట్టి సభ డిసిప్లిన్గా ఉండే దెప్పుడు? ఏపీ సమస్యలపై చర్చించేదెప్పుడు?!!