తెలుగు దేశంలో దోస్తీ కటీఫ్ చేసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోకేశ్ అవినీతి అంటూ కొత్త రాగం ఆలపిస్తున్న సంగతి తెలిసిందే.. పవన్ కారణంగా మొదటి సారి లోకేశ్ అవినీతి ఏపీలో ఇష్యూగా మారింది. జనంలోకి వెళ్లింది. దీనిపై చర్చ మొదలైంది. దాంతో టీడీపీ కూడా స్పందించక తప్పడం లేదు. ఇప్పటివరకూ పవన్ ఆరోపణలపై చంద్రబాబు, మంత్రులు ఇతర నేతలు మాత్రమే స్పందించారు.
తాజాగా పవన్ ఆరోపణలపై ఏకంగా నారా లోకేశ్ స్పందించారు. ఎవరో దుమ్మేస్తే నేను దులుపుకోవాలా అంటూనే పవన్ ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు వేశారు లోకేశ్. తనపై సీబీఐ విచారణ అంటూ ప్రచారం చేస్తున్నారన్న లోకేశ్.. ఎలాంటి విచారణకైనా భయపడేది లేదన్నారు. తప్పు చేయనప్పుడు మాకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. తన ఆరోపణలకు ఆధారాలు లేవని పవనే చెప్పారని.. అలాంటి నిరాధారమైన ఆరోపణలకు తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
పోలవరంలో అవినీతి జరిగిందన్న పవన్ ఆరోపణలకూ లోకేశ్ సమాధానం ఇచ్చారు. పోలవరంలో ఒక్క టెండరైనా తెలుగు దేశం ప్రభుత్వం ఇచ్చిందా అని ప్రశ్నించారు. పోలవరం భూనిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులు వెళ్లాయని.. తన ఖాతాలోకి కాదని లోకేశ్ సెటైర్ వేశారు. ఎన్టీఆర్ కు చెడ్డపేరు తెస్తున్నానని ఆరోపించడం బాధ కలిగించిందన్న లోకేశ్.. తాను చాలా పద్ధతిగా, క్రమశిక్షణగా పెరిగానన్నారు.
వరుసగా ఎనిమిదేళ్లుగా తన ఆస్తులు బహిరంగంగా ప్రకటిస్తున్నానని.. అంతకంటే ఎక్కువ ఉంటే తీసుకోమని సవాల్ చేస్తున్నానని లోకేశ్ అన్నారు. తన ఫోన్ నంబరు పవన్కల్యాణ్ వద్ద ఉందని.. తన గురించి ఎవరో.. ఏదో.. అనుకుంటున్నారంటే అది తనకే చెప్పొచ్చు కదా అని లోకేశ్ అన్నారు. పవన్ ఆరోపణలపై పరువు నష్టం వేసే అంశంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని లోకేశ్ అన్నారు.