నాలుగేళ్లుగా మిత్రులు.. ఇప్పుడు శత్రువులుగా మారారు. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలతో హీట్ పుట్టిస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభలో టీడీపీపైనా, లోకేష్ పైనా అవినీతి ఆరోపణలతో పవన్ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం సృష్టించారు. పవన్ ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్న టీడీపీ నేతలు.. పవన్ ఇంటిస్థలం ఎక్కడ నుంచి వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. తన దగ్గర డబ్బుల్లేవంటున్న పవన్.. 50కోట్లతో రెండెకరాల స్థలాన్ని ఎలా కొనుగోలు చేశారంటూ నిలదీస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు జనసేన, తెలుగుదేశం నేతల మధ్య ట్వీట్ వార్ సాగుతోంది.
జనసేన ఆవిర్భావ సభలో అధికార టీడీపీపై నిప్పులు చెరగటంతో పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యారు పవన్. దీంతో ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. అవినీతిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని.. కంచే చేనును మేసే చందంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తూన్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నంలో టీడీపీ నాయకులు పవన్ అమరావతిలో నిర్మిస్తున్న కొత్త ఇంటికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు బయటపెట్టి సోషల్ మీడియా వేదికగా అవినీతి ఆరోపణలతో పవన్ పై విరుచుకుపడుతున్నారు.
అత్యంత ఖరీదైన అమరావతి ప్రాంతంలో పవన్ రెండెకరాల భూమిని ఎలా కొనగలిగారంటూ విమర్శిస్తున్నారు. తన దగ్గర డబ్బుల్లేవని చెప్పే పవన్ కు 50కోట్ల విలువ చేసే భూమి ఎక్కడ నుంచి వచ్చిందని ఆరోపించారు. పవన్ ఢిల్లీ స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్నారని అందుకు ఆయనకు ప్రత్యేక ప్యాకేజీలు ముడుతున్నాయని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు, మంత్రులు. రోజుకో మాట, పూటకో డైలాగ్ తో పవన్ ఓ గజనీలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నేతల విమర్శలను తిప్పికొడుతూ.. జనసేన అధికారిక ట్విట్టర్ పేజ్లో ఆ స్థలం ఎప్పుడు కొన్నది? ఎంతకు కొన్నది? ఎవరి దగ్గర కొన్నారనే వివరాలతో ట్వీట్ చేశారు. డాక్యుమెంట్స్ ను సైతం అందులో పొందుపరిచారు. పవన్ కళ్యాణ్ కొన్న భూమి సర్వే నెంబర్లు సహా అన్నింటికి ఆధారాలు చూపింది జనసేన పార్టీ. తమ్ముళ్లకు ఆధారాలు కావాలంటే పెదకాకాని సబ్ రిజిస్టార్ని లేదా.. మంగళగిరి సబ్ రిజిస్టార్ ను సంప్రదించాలని కూడా చురకలింటించారు జనసేన శతఘ్ని టీం.
పవన్ పై నేరుగా మంత్రులో సీన్ లోకి రావడం, జనసేనపై విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క్రమంలో జనసేన అధినేత పవన్.. ఈసారి తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు ఆయనే నేరుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిని నేషనల్ మీడియాలో సైతం లేవనెత్తి విమర్శించిన పవన్.. తెలుగుదేశం పార్టీ నేతలపై చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు..తాజాగా లోకేష్ కూడా తనపై పవన్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు. అన్ని అంశాలను ప్రశ్నించే పవన్ ..ఇప్పుడు టీడీపీ ప్రశ్నలకు ఎలా సమాధానం చెబుతారో చూడాల్సి ఉంది.