ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా రాజకీయాలు బాగా వేడెక్కి పోతున్నాయి. మొన్నటి వరకు బీజేపీ, టీడీపీ మిత్ర పక్షంగా ఉన్నా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పిన తర్వాత అధికార పార్టీ సైతం కేంద్రంపై సీరియస్ గా ఉంది. మరోవైపు వైసీపీ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాణం పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ కూడా అవిశ్వాస తీర్మాణం పెట్టింది. ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నిప్పులు చెరిగారు.
ఓవైపు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టి... మరోవైపు ప్రధాని కార్యాలయంలో ఎందుకు తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ ద్వంద్వ నీతిని, నీతి బాహ్యమైన చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే పీఎంఓ లో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మాట్లాడుతూ..గతంలో మీడియాతో అరుణ్ జైట్లీ మాట్లాడిన విషయాలు జనాల్లోకి బాగా వెళ్లాయని... దేశ రక్షణ, సైన్యం నిధులను తాము అడిగామని జైట్లీ చేసిన తప్పుడు ప్రకటన జనాల్లో ఆవేశాన్ని పెంచిందని అన్నారు.
అంతే కాదు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని..మొన్నటి వరకు మాతో సఖ్యంగా ఉన్న ఆయన ఒక్కసారే యూటర్న్ తీసుకోవడం వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ అర్థం అవుతుందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు తాము కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని..కేంద్రంతో సైతం ఢీ కొంటున్నామని అన్నారు.
వృద్ధి రేటులో తెలంగాణ కన్నా ఏపీ 2 శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ... తలసరి ఆదాయంలో రూ. 33 వేలు తక్కువగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. మోదీ ప్రభుత్వంపై తెలుగువారంతా ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలంతా సంఘటితంగా పోరాడాలని సూచించారు. అవిశ్వాసంపై చర్చను జరపడం మినహా... కేంద్ర ప్రభుత్వానికి మరో దారి లేదని అన్నారు.