ఓడ దాటే వరకు ఓడమల్లన్న.. ఓడ దాటాక బోడి మల్లన్న! అన్నట్టుగా పవన్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు టీడీపీ నేత లు. మాతో ఉంటే బంగారం, లేకపోతే.. సింగారం.. అన్నట్టుగా పవన్ విషయంలో కామెంట్లు కుమ్మరించారు. తాజాగా పవన్ యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పవన్.. గత వారం పది రోజులుగా తన వాయిస్ను మార్చుకున్నారు. బాబును మించిన నాయకుడు లేడని ప్రకటించిన పవన్.. వెంటనే బాబు వేస్ట్ అని, అవినీతిలో రాష్ట్రం కూరుకుపోయిందని ప్రకటనలు గుప్పించాడు.
ఈ పరిణామాలతో ఉలిక్కి పడిన టీడీపీ నేతలు.. రివర్స్ ఫైట్ ప్రారంభించేశారు. వాస్తవానికి పవన్ విషయంలో టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు నోటి దూల ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయితే, చంద్రబాబు సర్ది చెబుతూనే ఉన్నారు. అయితే, తాజాగా పవన్ యూటర్న్ తీసుకుని బాబు పాలనలోని లోపాలను ఎత్తి చూపే సరికి.. తెలుగు దేశం నేతలు కట్టగట్టుకుని పవన్ పై ఆరోపణలు ఎక్కు పెడుతున్నారు. అవినీతి - ప్రత్యేక హోదా విషయంలో ప్రయత్నలోపం సహా ఇతరత్రా అంశాలపై పవన్ సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీఎం చంద్రబాబు - ఆయన తనయుడు లోకేష్ అవినీతి గురించి పవన్ ప్రశ్నించారు.
దీంతో తమ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు - పార్టీ వాదనను వినిపించేందుకు టీడీపీ నేతలు విమర్శల యుద్ధం ప్రారంభించేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పందిస్తూ పవన్ నిరాధార ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు, ఆయన దుమ్మెత్తిపోస్తే నేనే దులుపుకోవాలా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలపై నేరుగా నాకే ఫోన్ చేసి అడగొచ్చుకదా? అని అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ పోలవరంలో జరిగిన అవినీతి ఏంటో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు.
అవినీతి ఆరోపణలను ఆధారాలతో గాని రుజువు చేస్తే చర్యలు తీసుకునే ధైర్యమున్న ప్రభుత్వం తమదని ఆయన వివరించారు. టీడీపీపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇమేజే నాశనమైందని రివర్స్ ప్లే చేశారు. పవన్ మాట మారుస్తున్నారని రాష్ట్రానికి ఏమైనా చేయదలుచుకుంటే ఢిల్లీకి వెళ్లి చేయాలని సూచించారు. హోదా పైనా మాట మారుస్తున్నారని.. అవిశ్వాసానికి మద్దతు కూడగడతానన్న పవన్.. ఢిల్లీకి పోకుండా ఇక్కడే ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.
ఇక, ఈ వరుసలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రజల్లో పవన్ కళ్యాణ్ విశ్వాసం కోల్పోయారని తెలిపారు. నారా లోకేష్పై నిరాధార ఆరోపణలు చేసిన పవన్... లోకేష్ గురించి తనకు ఎవరో చెప్పారని.. తనకు కల వచ్చిందని అంటున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడుతుంటే పవన్ కళ్యాణ్ విజయవాడలో కూర్చున్నారని విమర్శించారు. మొత్తంగా తమ పార్టీకి అనుకూలంగా ఉంటూ.. జగన్ను తిడితే పవన్ మంచివాడని, తమ దగ్గరకు వచ్చే సరికి విలన్ అని టీడీపీ పెద్దలు పేర్కొనడం గమనార్హం. దీనిని బట్టి పవన్ను టీడీపీ బోడి మల్లయ్యను చేసిందనడంలో సందేహం లేదు.