గత పదిరోజుల క్రిందట సినీనటి కవిత టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీలో మహిళలకు సముచిత స్థానం లేదని, తాను 1983నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడి సేవచేస్తున్నా  ఎలాంటి పదవీ ఇవ్వలేదు సరిగదా ఏకంగా  పార్టీ నుంచి గెంటేశారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో బీజేపీలోకి చేరారు.


అయితే ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబుపై ఆమె సంచలన వాఖ్యలు చేశారు. టీడీపీలో నుండి మిమ్మల్ని తరిమేశారా ? లేక మీరే బయటికొచ్చారా ? అని యాంకర్ ప్రశ్నవేయగా..ఎవరూ వెళ్లిపొమ్మని సూటిగా చెప్పరు. చంద్రబాబు, ఆయన చుట్టూ ఉన్నవాళ్లు పొగబెట్టారని ఆమె ఆరోపించారు. కేవలం తన ఆటిట్యూడ్ వల్ల సమస్య వచ్చి ఆమె పార్టీ మారిందన్న టీడీపీ శ్రేణుల ఆరోపణలను ఆమె ఖండించారు. ప్రేమ, అభిమానం, కష్టం అనేవాటికి చంద్రబాబు విలువ ఇవ్వడని ఆమె చెప్పారు.


ఆమె ఇంకా మాట్లాడుతూ - చంద్రబాబు గారు తన మనవడిని చూసి నెలరోజులయిందని చెప్పారు. ఆ మాటలు విని నేను నవ్వుకున్నాను. దాదాపు పది సంవత్సరాల పాటు భర్తకు, పిల్లలకు దూరంగా ఉంటూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డానని ఆమె కంటతడి పెట్టారు. నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది పార్టీకి కష్టపడ్డారని, జైలుకు కూడా వెళ్లారని ఆమె గుర్తు చేసారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, బాబు కూర్చోవటం కార్యకర్తల త్యాగ ఫలితం అని ఆరోపించారు. అలాంటి  కార్యకర్తలు లేకపోతే చంద్రబాబును కౌన్ కిస్కా గొట్టం అని పక్కనపెడతారని ఆమె వాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: