దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నవేళ పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల హడావుడి మొదలైంది. మొత్తం 58 స్థానాలకు 23వ తేదీన ఎన్నిక జరగనుంది. ఇందుకోసం పలు పార్టీలో బరిలో నిలిచారు. ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో బలం పెంచుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనం కాగా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం హోరాహోరీ పోరు తప్పేలా లేదు.
దేశవ్యాప్తంగా 59 స్థానాలకు 23వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 3, తెలంగాణలో 3, ఉత్తర ప్రదేశ్ లో 10, బీహార్ లో 6, మహారాష్ట్రలో 6, బెంగాల్ లో 5, మధ్యప్రదేశ్ లో 5, గుజరాత్ లో 4, కర్నాటకలో 4, రాజస్థాన్ లో 3, జార్ఖండ్ లో 2, ఉత్తరాఖండ్ 1, చత్తీస్ గఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 1, కేరళ 1, హర్యానా లో 1 స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రస్తుతమున్న బలాబలాలను బట్టి అధికార బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కనున్నాయి. ఓవరాల్ గా 29 నుంచి 32 స్థానాలు ఆ పార్టీకి దక్కే అవకాశముంది. కాంగ్రెస్ కు 7 లేదా 8, తృణమూల్ కాంగ్రెస్ కు 4, బీజేడీ, టీఆర్ఎస్ లకు 3 చొప్పున వస్తాయి. టీడీపీ, ఆర్జేడీ, జేడీయూలకు 2 చొప్పున స్థానాలు దక్కే అవకాశముంది. అయితే.. 10 రాష్ట్రాల్లోని 33 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 25 స్థానాలకు మాత్రం ఎన్నిక జరగనుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎన్నిక జరగనుంది.
మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఉత్తర ప్రదేశ్ ఎన్నిక ఈసారి ఆసక్తిగా మారింది. మొత్తం 10 స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీకి 8 మందిని గెలుచుకునే సత్తా ఉంది. అయితే చివరి నిమిషంలో మరో అభ్యర్థిని కూడా బరిలోకి దించడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఒక్కో అభ్యర్థి గెలవడానికి 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 47 మంది ఎమ్మెల్యేలున్న ఎస్పీ, 19 మంది ఎమ్మెల్యేలున్న బీఎస్పీ చెరో అభ్యర్థిని బరిలోకి దించాయి. బీఎస్పీకి తగినంత బలం లేకపోవడంతో ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులుంటారు. ప్రస్తుతం బీజేపీకి 58 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. టీడీపీతో కూడిన ఎన్డీఏ బలం 83 మాత్రమే. అయితే ఈ ఎన్నికల తర్వాత సొంత బలాన్ని పెంచుకునేందుకు ట్రై చేస్తోంది. ఈ ఎన్నికల తర్వాత మరో 30 స్థానాల వరకూ బీజేపీ గెలుచుకునే అవకాశముంది. అప్పుడు ఆ పార్టీ బలం 110కి చేరుతుంది. కీలక బిల్లులను ఆమోదం పొందించుకునేందుకు రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం అవసరం. ఈసారి ఆ మ్యాజిక్ మార్క్ దాటుతామనే ధీమా ఆ పార్టీలో కనిపిస్తోంది.