మొన్నటి వరకూ చెట్టాపట్టాలేసుకుని నడిచిన బీజేపీ, టీడీపీ నేతలు ఇప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసెంబ్లీలోనూ, బయటా మాటల యుద్ధం స్టార్ట్ చేసేశారు. అయితే బీజేపీలోని కొందరు నేతలు మొదటి నుంచి చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఒక రకంగా టీడీపీతో బీజేపీ కటీఫ్ కు ఇలాంటి నేతలే కారణంగా చెప్పుకోవచ్చు.. అలాంటి వారిలో సోము వీర్రాజు ముందు వరుసలో ఉంటారు.
బీజేపీతో టీడీపీ కటీఫ్ చెప్పేసిన తరవాత ఇక సోము వీర్రాజు విమర్శలకు అడ్డూ అదుపూ ఉండే అవకాశమే లేదు. కలసి ఉన్నప్పుడే చంద్రబాబుపై దుమ్మెత్తిపోసిన సోము వీర్రాజు.. ఇక ఇప్పుడు టీడీపీపై పూర్తి స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఐతే.. సోము వీర్రాజుకు ఎమ్మెల్యే సీటే టీడీపీ దయ వల్ల వచ్చిందని టీడీపీ నేతలు చెప్పుకుంటుంటారు. టీడీపీ సహకారం వల్లే సోము వీర్రాజు శాసన మండలికి ఎన్నికయ్యారన్నది వాస్తవమే.
ఐతే.. టీడీపీ నేతల ఎత్తిపొడుపులను సోము వీర్రాజు కూడా అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. తమ దయ వల్లే వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందనే టీడీపీ నేతలకు ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తే, తాను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని అంటున్నారు. గత ఎన్నికల్లో
టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయని ఆయన గుర్తు చేస్తున్నారు.
ముఖ్యమంత్రితో పాటు అంతా రాజీనామాలు చేస్తే తాను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసురుతున్నారు. తాను ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని చెబుతున్నారు. అప్పుడప్పుడు తిక్కగా మాట్లాడినా సోము వీర్రాజు చెప్పిన దాంట్లోనూ కాస్త లాజిక్ కనిపిస్తోంది కదా..!