ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను ఘోరంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పూటకో మాట మాట్లాడుతూ..ప్రజలను ఇంకా మభ్య పెడుతున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో నిర్వహించిన ర్యాలీలో జగన్ మాట్లాడుతూ... ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఈ నాలుగేళ్లు గట్టిగా అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చేదని అన్నారు.
ఇన్నాళ్లు బీజేపీతో జతకట్టి ఆయన పనులు మాత్రమే చేసుకొని తీరా ప్రత్యేక హోదా విషయానికి వస్తే..ఆ పార్టీతో విభేదిస్తున్నాం అంటూ..కేంద్రంతో విభేదిస్తున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మనకు ఇచ్చిన మాటను చంద్రబాబు నాయుడు దగ్గరుండి నీరుగార్చారని అన్నారు. ఎన్నికల ముందు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అన్నారని, 2016లో అర్ధరాత్రి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెబితే ఆయనకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారని జగన్ అన్నారు.
కానీ అప్పట్లో అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి తమ నేతలను వైదొలిగించారని అన్నారు. ఎన్నికల ముందు ప్రజల వద్దకు వెళ్లిన చంద్రబాబు ఎన్నో హామీల వర్షం కురిపించారని అవి ఇప్పటికీ నెరవేర్చకుండా మరోసారి ఎన్నికలకు సిద్దం అవుతున్నారని ఈసారి ప్రజలు ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
ఎన్నికల తరువాత హోదా సంజీవని కాదని చెప్పారని, ప్రత్యేకహోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని చంద్రబాబు అన్నారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు ప్రత్యేక హోదా రాగాన్ని ఎత్తుకున్నారని జగన్ విమర్శించారు. పూటకో మాట మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు
ఉన్నారని, ఉద్యోగాల కోసం వారు ఎక్కడికి పోవాలని జగన్ ప్రశ్నించారు.
ఎన్నికల ముందు ఏం మాట్లాడారో, ఎన్నికల తరువాత ఏం
అన్నారో, మళ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో ఇప్పుడు ఏం
మాట్లాడుతున్నారో ప్రజలు గుర్తించాలని జగన్ అన్నారు.