గుమ్మడికాయల దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్న చందంగా ఉంది ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి! `నన్ను బలహీనపరిచేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. జగన్, పవన్ను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతోంది` అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న నాటి నుంచి ఆయన ఇదే `సానుభూతి` రాగాన్ని ఆలపిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కేంద్రం దృష్టి పెట్టిందనే గుసగుసలు ఇప్పుడు మరింత ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఒకవేళ భవిష్యత్లో కేంద్రం.. నిజంగానే అవినీతి, అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేస్తే.. ఇదంతా కుట్రలో భాగమే అని ప్రజల్లో సానుభూతి కొట్టేయడానికే ఇలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. నిజాయితీకి మారుపేరుగా చెప్పుకునే చంద్రబాబు.. ఒక్కసారిగా సానుభూతి రాజకీయాలు ఎందుకు మొదలుపెట్టారనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది.
రాజకీయ నాయకులకు ముందు చూపు అత్యంత అవసరం! మరి రాజకీయాల్లో 40 ఏళ్ల అపార అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ ముందుచూపు ఒకింత ఎక్కువే!! అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తమకు లబ్ధి చేకూర్చే ఏదో ఒక అంశం ఉండేలా చాలా జాగ్రత్త పడుతుంటారు. అసలే ఎన్నికల సమయం.. అందులోనూ మిత్రులందరూ దూరమైపోయిన వేళ.. అవినీతి ఆరోపణలు విపరీతంగా చుట్టుముడుతున్నప్పుడు.. సీబీఐ దర్యాప్తు వంటి అంశాల న్నింటి నుంచి బయటపడాలంటే కొన్ని సంచలన నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాలి. తనను ఈ గందర గోళ పరిస్థితుల నుంచి గట్టెక్కించేది `సానుభూతి` అని అనుకున్నారో ఏమో తెలీదు గానీ ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చూస్తున్న వారంతా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు `భవిష్యత్` కళ్ల ముందు కనపడుతోందంటున్నాయి టీడీపీ వర్గాలు! తనను, లోకేష్ను, మంత్రులను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆయన టెలీకాన్ఫరెన్స్ లో ప్రకటించటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ముందు జాగ్రత్త చర్యగానే చంద్రబాబు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి `సానుభూతి` రాజకీయం చేసేందుకు రెడీ అయిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ఆకస్మాత్తుగా ఇప్పుడు సీబీఐ కేసులు పెట్టినా.. లేక ఇతర చర్యలు ఏమి మొదలుపెట్టినా కక్ష సాధింపు చర్యల్లో భాగం అనే విమర్శలు వెల్లువెత్తటం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు. నిజంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు ఎలాంటి అవినీతికి పాల్పడకపోతే.. అక్రమాలు చేయకపోతే సీబీఐ కాదు కదా? ఏ ఏజెన్సీ విచారణకు అయినా ఎందుకు భయపడాలి? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
లాలూచీ రాజకీయాలు పాల్పడనని, పారదర్శకంగా, నిజాయితీగా రాజకీయాలు చేస్తానని పదేపదే చెప్పుకునే ఆయన.. ఇప్పుడు ఎందుకు ఇంత అయోమయానికి గురవుతుండటంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీతోనే ఢీ కొట్టానని చెప్పుకుంటున్న ఆయన.. కేసులకు భయపడాల్సిన అవసరం ఉందా? నిప్పులా నిజాయితీతో నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు సీబీఐ విచారణకో.. మరో విచారణకో భయపడాల్సిన అవసరం ఏముందో ఆయనకే తెలియాలి. మరి కేంద్రం ఇంకా ఎటువంటి సీబీఐ ఎంక్వైరీకి కానీ, అవినీతి గురించి కానీ చర్యలు ప్రారంభించకముందే.. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ఇలాంటి సానుభూతి రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ఇప్పటికే స్కెచ్ వేశారని.. బీజేపీ ఆ విషయాన్ని గ్రహించి ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.