ఏపీకి చెందిన అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ఎంపీలు గత నాలుగు రోజులుగా పార్లమెంటులో సృష్టిస్తున్న రగడ, వివాదం అంతా ఇంతా కాదు. పార్లమెంటు చరిత్రలోనే ఇది మరో అధ్యాయం కావడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. గత నాలుగు రోజులుగా టీడీపీ, వైసీపీ ఎంపీలు పోటా పోటీగా పార్లమెంటు ఉభయ సభల్లోనూ రగడ సృష్టిస్తున్నారు. కేంద్రం ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబడుతున్నారు. అయితే, ఈ విషయంలో రోజూ రగడే తప్ప ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. ఎంపీలు ఆందోళన చేయడం, పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడడం షరా.. మామూలు! అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మరి దీనికి మధ్యే మార్గం లేదా ? ఇక, ఎన్నాళ్లని పరిస్థితి ఇలా కొనసాగుతుంది? ఇదీ ఏపీ ప్రజల్లో ఇప్పుడు రగులుతున్న ప్రశ్నలు.
మరి ఈ విషయంపై దృష్టి పెడితే.. ఏపీ సమస్యలపై ఇక్కడి అధికార, విపక్షాలు కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయిం చుకున్నాయి. అయితే, అదేసమయంలో కేంద్రంలోని ఏ ప్రభుత్వమైనా ఇరుకున పడాలని చూడదు కదా ?! ఈ క్రమంలో నే దానికి ఉన్న అవకాశాలను అది వినియోగించుకుని చర్చ జరగకుండా, సమాధానం చెప్పే పరిస్థితి రాకుండా చేసుకో వడం సహజం. గతంలోనూ ఇదే జరిగింది. ఇదే తీరుగా ప్రధాని నరేంద్ర మోడీ వెనుక ఉండి చక్రం తిప్పారో ? లేక ఏమైందో తమిళనాడుకు చెందిన అధికార పార్టీ అన్నాడీఎంకే, తెలంగాణకు చెందిన అధికార పార్టీ టీఆర్ ఎస్ ఎంపీలు.. మింగుడు పడని, పరిష్కారం లభించని సమస్యలను పార్లమెంటులో తాజాగా లేవనెత్తారు. ఈ రెండు పార్టీల ఎంపీలు కూడా ఏపీ ఎంపీలతో సమానంగా రగడ సృష్టిస్తున్నారు.
దేశంలోని రాష్ట్రాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలకు రిజర్వేషన్లపై పూర్తి అధికారం కట్టబెట్టాలనేది టీఆర్ ఎస్ ఎంపీల వాదనగా ఉంది. నిజానికి ఇది రాజ్యాంగంలోనూ లేదు. మరి అలాంటి సమస్య ఇప్పుడు ఎలా పరిష్కారం అవుతుంది. రిజర్వేషన్లు అనేవి 50% మించి ఇవ్వరాదని సుప్రీం కోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీ వాటి రాజకీయ లబ్ధి కోసం ఇష్టారాజ్యంగా రిజర్వేషన్లను కట్టబెడతామంటే ఎలా కుదురుతుంది. కాబట్టి టీఆర్ ఎస్ ఎంపీలు లేవనెత్తిన సమస్య ఇప్పట్లో సమసి పోయేది కాదు. దీనిపై చర్చకూడా జరగేది కాదు. ఇది కేంద్రం పరిధిలోనూ లోదు. ఇక, తమిళనాడు అధికార పార్టీ ఎంపీలు(విపక్షం డీఎంకే ఎంపీలు మాత్రం ఏపీకి సహకరిస్తున్నాయి. అవిశ్వాసానికి మద్దతిస్తున్నాయి) అక్కడి సమస్యను లేవనెత్తుతున్నాయి.
తమిళనాడు ఎంపీలు లేవనెత్తుతున్న సమస్య కూడా పరిష్కారం అయ్యేది కాదు. కావేరీ జలాలపై సుప్రీం కోర్టు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించి పరిష్కారం చూపింది. దీనిని తోసిపుచ్చి కేంద్రం తమిళనాడుకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకునే సాహసం చేయదు. అలా చేస్తే.. ఎన్నికల ముంగిట్లో ఉన్న కర్ణాటకలో ముసలం పుట్టడం ఖాయం. సో.. తమిళనాడు ఎంపీలు లేవనెత్తిన సమస్యా చర్చకు చేపట్టే అర్హత ఉన్నది కాదు. అయినా ఈ రెండు పార్టీలు, రాష్ట్రాల ఎంపీలు ఇలా ఆందోళనకు దిగుతున్నాయంటే.. దీనివెనుక ఏదో స్కెచ్ అమలవుతోందని ఇట్టే అర్ధమవుతోంది.
దీనిని గ్రహించాల్సిన ఏపీ ఎంపీలు అదేపనిగా నినాదాలు చేస్తుండడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ విషయాన్ని, స్కెచ్ను గుర్తించి స్పీకర్ సుమిత్రా మహాజన్తో చర్చలకు వెళ్లి సానుకూలంగా అవిశ్వాసం చర్చకు వచ్చే మార్గంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఆదిశగా అడుగులు వేస్తేనే పార్లమెంటులో అనుకున్నది సాధ్యం అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. లేకపోతే.. వృథా ప్రయాసగానే, మరో నాటకంగానే వీరి ఆందోళన మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.