ఉపాధ్యాయులంటే..విద్యార్థులకు జీవితాలు బంగారు బాటలు వేసే వారు అయి ఉండాలి. ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం కేవలం గురువుకే ఉంటుంది. అలాంటి గురువు స్థానంలో ఉంటూ..ఎన్నో దుర్మార్గాలకు తెగబడుతున్నారు కొంత మంది ఉపాధ్యాయుడు. తమ స్వార్థం కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజాగా జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో గురువారం పరీక్ష ప్రారంభం కాకముందే టెన్త్ పేపర్ లీక్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఓ గణిత ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ హైస్కూల్లో గణితం పేపర్-2 పరీక్ష జరగాల్సి ఉండగా ముందుగానే పేపర్ను పాఠశాల సమీపంలోని ఓ గదిలో ఓపెన్ చేసి ఫోటోలతో వాట్సప్లలో పంపిస్తున్నారనే సమాచారం అందుకున్న ఎస్సై సోమ సతీష్ సివిల్ డ్రెస్లో వెళ్లి ఉపాధ్యాయుల నీచపు పనిని బహిర్గతం చేశారు.
ఎస్సై రాకను గమనించిన ఉపాధ్యాయులు అక్కడినుండి పారిపోయారు. ఎస్సై వారిని చేజ్ చేసి మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణగౌడ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరో ఇద్దరు ఉపాధ్యాయులు, ముగ్గురు మహిళా ఉపాధ్యాయులకు సంబంధించిన హ్యాండ్బ్యాగ్లు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయం బయటికి పొక్కడంతో మండలంలో టెన్త్ పేపర్లీక్ చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై స్పందించిన డీఈవో వెంకటేశ్వర్లు.. ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.మూడు రోజుల క్రితం ఆదిలాబాద్, వనపర్తి జిల్లాలో ఇంగ్లీష్ పేపర్ లీకైన విషయం తెలిసిందే. పేపర్ లీక్ వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.