కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత కొరవడితే కక్ష సాధింపులు చాలా కామన్. గతంలో కూడా ఎన్నోసార్లు ఈ కక్ష సాధింపులు చాలానే చూశాం. అంతెందుకు.. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు చేసిన సంఘటనలు మన రాష్ట్రంలో కోకొల్లలు..! ఇందుకు అతి పెద్ద ఉదాహరణ జగన్, చంద్రబాబులే..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కక్ష సాధింపు ఏంటో దేశమంతా తెలుసు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టాడనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జగన్ పై ఎన్నో కేసులు నమోదయ్యాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కూడా ఇది కక్షసాధింపు, సరికాదు అని చెప్పలేదు సరికదా.. ప్రభుత్వాలకు సహకరించారు. పైగా లక్షకోట్ల అవినితీకి పాల్పడ్డారంటూ ఆరోపించారు. దీంతో సీబీఐ రంగంలోకి దిగి జగన్ కు చెందిన ఆస్తులన్నింటినీ జప్తు చేసింది. జగన్ ను జైలుకు పంపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు రాష్ట్ర ప్రజలందరూ సాక్ష్యులే.!
ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. ఏపీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇందులో ఎవరూ కాదనేది లేదు. ఎన్నికల ముందే పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాయి టీడీపీ-బీజేపీ. నాలుగేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఇప్పుడు రాష్ట్రానికి బీజేపీ న్యాయం చేయలేదంటూ అధికారంలోని టీడీపీ .. బీజేపీకి విడాకులిచ్చేసింది. కేంద్రంలో ఇద్దరు మంత్రులను వెనక్కు తీసుకుంది. ఎన్డీయే నుంచి కూడా వైదొలిగింది. రాష్ట్ర ప్రయోజనాలకోసమే తాము పోరాడుతున్నామని, ఇందుకోసం ఎంతవరకైనా పోరాడుతామని టీడీపీ చెప్తోంది. ఇందులో తప్పుబట్టాల్సిందేమీ లేదు.
అయితే.. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న కొన్ని ఆరోపణలు వినడానికి విడ్డూరంగా ఉంటున్నాయి. నాడు జగన్ పై కక్షసాధింపును దగ్గరుండి ఎంకరేజ్ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీ సర్కార్ తమపై కక్షసాధింపుకు పాల్పడుతుందంటూ భయపడిపోతున్నారు. కేసులు పెడ్తుందని, నిధులు రాకుండా అడ్డుపడుతుందని.. ఇలా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. పైగా ఇప్పుడు పీఎంవో కార్యాలయానికి వైసీపీ నేతలు వెళ్లడాన్ని కూడా చంద్రబాబు తప్పుబడుతున్నారు. ఎంపీలుగా ఉన్న వ్యక్తులు ప్రధానిని కలిసే అర్హత ఉండదా అనేది వైసీపీ ప్రశ్న. చంద్రబాబు ధోరణి ఎలా ఉందంటే.. తాను చేస్తే కాపురం, ఇంకోడు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉందనేది పలువురి ఆరోపణ.