ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిన్సియర్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నసీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గతంలో తాను పదవిలో కొంత కాలం కొనసాగుతానని..రాజకీయాల్లోకి ఇప్పట్లో రానని చెప్పిన లక్ష్మీనారాయణ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని చర్చలు మొదలయ్యాయి. మొదట్లో లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు హల్ చల్ చేసినా..తాజాగా పవన్ కళ్యాన్ స్థాపించిన ‘జనసేన’ పార్టీలోకి వెళ్లబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం మహారాష్ట్రలో అడిషనల్ డీజీగా ఉన్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజకీయాల్లోకి వస్తున్నారని, జనసేనలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు ఆయనను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నేతలు కూడా ఆయనతో టచ్లో ఉన్నట్టు చెబుతున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన లక్ష్మీనారాయణ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జగన్ అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం మైనింగ్ కేసుల దర్యాప్తుతో ఒక్కసారిగా ఆయన వెలుగులోకి వచ్చారు.
సీబీఐ జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా జగన్ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆయన పేరు మార్మోగిపోయింది. డిప్యుటేషన్ తర్వాత తిరిగి ఆయన మహారాష్ట్ర వెళ్లిపోయారు. అక్కడ విధులు నిర్వహిస్తున్నా.. ఏపీ, తెలంగాణలో పాఠశాలల మరమ్మతు పనులు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. కొంత కాలంగా లక్ష్మీనారాయణతో బీజేపీ నేతలు కూడా టచ్లో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనను ఎలాగైనా పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం.
మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కూడా లక్ష్మీనారాయణ టచ్ లో ఉన్నట్లు..ప్రజల కోసం పోరాడే పార్టీగా ముందుకు సాగుతున్నట్లు..మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు మా పార్టీలోకి వస్తే..పార్ట గౌరవం కూడా పెరుగుతుందని చెప్పినట్లు సమాచారం. దాంతో పవన్ కల్యాణ్తో కలిసి రాజకీయ రంగంలో అడుగులు వేస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా, తన రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న వార్తలను లక్ష్మీనారాయణ కొట్టిపడేశారు.