రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఏ నోట విన్నా ఒకటే టాపిక్.. ఆపరేషన్ గరుడ! టీడీపీలో అనిశ్చితి, అలజడి వాతావరణం సృష్టించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ను పావులుగా చేసుకుని కేంద్రం రూపొందించి న వ్యూహమే ఈ ఆపరేషన్ అనే ప్రచారం వైరల్గా మారింది. ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా తమ కంట్రోల్లో పెట్టుకునేందు కు దీనిని రూపొందించారని సినీనటుడు శివాజీ వివరించిన నాటి నుంచి రాజకీయ పరిస్థితులు హీటెక్కాయి.
ఈ ఆప రేషన్లో పవన్, జగన్తో పాటు రాష్ట్ర పరిస్థితులపైనేగాక, రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న మరో వ్యక్తి కూడా కీలక పాత్ర పోషించబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేసే గవర్నర్ నరసింహన్ `అపరేషన్ గరుడ`లో ముఖ్యమైన బాధ్యతలు నెరవేర్చబోతున్నారట.
రాష్ట్ర విభజన సమయం నుంచి గవర్నర్గా నరసింహన్నే కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. విభజన పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉండటంతో పాటు ఇరు రాష్ట్రాల సీఎంలతో సత్సంబంధాలు కొనసాగిస్తుండటం.. నొప్పించక తానొప్పక అన్న చందంగా వ్యవహరిస్తుండటంతో ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన్ను మాత్రం గవర్నర్ గిరీ నుంచి తొలగించే సాహసం చేయడం లేదు. అంతేగాక ఆంధ్రా, తెలంగాణలో రాజకీయ పరిస్థితులను ఆయనే ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తుంటారు. కాంగ్రెస్ తో పాటు చాలా పార్టీలు నరసింహన్ ను వ్యతిరేకిస్తున్నా… ఆర్.ఎస్.ఎస్. భావజాలం ఆయనకి కొంత ఉందనీ, అందుకే భాజపా ఆయన్ని కొనసాగిస్తోందనే అభిప్రాయమూ ఉంది.
ఆంధ్రాలో చంద్రబాబు సర్కారును నిర్వీర్యం చేయడానికి `ఆపరేషన్ గరుడ` పేరుతో బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసిందని, గత కొన్ని నెలలుగా దాన్ని అమలు చేస్తోందనే కథనాలు గుప్పుమంటున్నాయి. రాజకీయ అనిశ్చితి సృష్టించమే లక్ష్యంగా ఆంధ్రా విషయంలో గత కొన్ని నెలలుగా బీజేపీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, బడ్జెట్ లో అరకొర కేటాయింపులు, విభజన హామీలపై మొండి వైఖరీ… ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న కుట్ర అన్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి.
ఈ కుట్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, విపక్ష నేత జగన్ ను బీజేపీ వాడేసుకుంటోందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం, ఇదే సమయంలో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్పై సీబీఐని ప్రయోగించడం వంటివి చేసి రాష్ట్రపతి పాలన పేరుతో ఆంధ్రాను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని బీజేపీ వ్యూహమని చెబుతున్నారు.
ఈ `ఆపరేషన్ గరుడ`లో గవర్నర్ నరసింహన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారట! కేంద్ర ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటూ వస్తున్న ఆయనకు ఇందులో కీలక బాధ్యతలు అప్పజెబుతారనే టాక్ పొలిటికల్ వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది.
ఇందులో భాగంగా పవన్ కల్యాణ్, జగన్ కూడా నరసింహన్ తో ఈ మధ్య బాగానే టచ్ లో ఉంటున్నారనీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం భాజపా దృష్టంతా ఆంధ్రా మీద ఉందనీ, ఎలాగైనాసరే చంద్రబాబు సర్కారును దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే చాపకింద నీరులా కొన్ని నెలలుగా బీజేపీ నిర్లక్ష్యంగా ఉంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.