రాష్ట్రంలో ఉప ఎన్నికల వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దు తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు ఓటు హక్కు లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవని పలువురు నేతలు అంటున్నారు. దీంతో అధికార, ప్రతిపక్షాలు ఎన్నుకలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు తమ పార్టీ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దుతో ఖాళీ అయిన స్థానాల్లో తిరిగి గెలుపొందేందుకు కాంగ్రెస్ తన బలాన్ని కూడగడుతోంది.
మరోపక్క ఆ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించి ప్రతిపక్ష పార్టీని ఆత్మరక్షణలో పడేయడాలని అధికార పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఒక వేళ ఉప ఎన్నికలు అనివార్యం అయితే ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన రాష్ట్ర మంత్రులకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారనున్నాయి. రాష్ట్ర మంత్రులు జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావులకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సర్వేల్లో ఆయా జిల్లా మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు సెమీ ఫైనల్గా నిలవనున్నాయి. ఈ క్రమంలో నల్గొండ, అలంపూర్ నియోజకవర్గాల్లో విజయం సాధించి తమ పట్టునిలుపుకునేందుకు మంత్రులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై టీఆర్ ఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూపాల్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం బరిలోకి దించనుంది. భూపాల్ రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు.
మరోపక్క ఆలంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ పై టీఆర్ ఎస్ తరపున శ్రీనాథ్ ను పోటీకి నిలపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క శ్రీనాథ్ తండ్రి, మాజీ ఎంపీ మందా జగన్నాథం కూడ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ బలంగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాల్లో గెలిచి తీరాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.
పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. అదేవిధంగా అభ్యర్థుల గెలుపు ఓటమిల్లో ఆయా జిల్లా మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యులను చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు .ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉపఎన్నికలను తలుచుకుంటూ ఆయా జిల్లా మంత్రులు భయాందోళనకు గురవుతున్నట్లు సమాచారం.