ఈ విళంబి నామ సంవత్సరం అన్ని హైందవ పండుగ రోజులపై గందరగోళం నెలకొంది. సంక్రాంతి, మహా శివరాత్రితోపాటు ప్రస్తుతం శ్రీరామనవమి పండుగ నిర్వహణపై పండితులకు ధర్మసందేహం ఉత్పన్నమైంది. శ్రీరామనవమిని మార్చి 25న నిర్వహించాలా? లేదా 26న నిర్వహించాలా? అనే సందేహం సందిగ్ధం భక్తజనుల్లో కలిగింది.
ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వేర్వేరు తేదీల్లో ఈ పండుగను నిర్వహణ ఏర్పాట్లు చేయడంతో ఈ గందరగోళం నెలకుంది.
నిజానికి 'టీటీడీ క్యాలెండర్' ప్రకారం మార్చి 25న శ్రీరామనవమి. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 26న భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాన్ని
నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు మాత్రం టీటీడీ క్యాలెండర్ అనుసరించనుంది. కారణం చైత్ర శుద్ధ నవమి తిథి, మార్చి 25న అదీ సూర్యోదయం తర్వాత వస్తుంది. మార్చి 26న సూర్యోదయానికి ముందుగానే ముగిసిపోతుంది. అంటే ఆ సమయానికి దశమి వచ్చేస్తుంది.
కాబట్టి ముందు రోజునే అంటే 25న శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించాలని "ధర్మసింధు" (వేదాలలో నిర్ధేశించిన వేద విహిత కర్మలు, వైదిక ధర్మాలు, వాటిని ఆచరించాల్సిన విధి విధానాల గురించి సామాన్యులకు తెలియ జేసే అపూర్వ ధర్మశాస్త్రమే "ధర్మసింధు") ప్రకారం తెలుస్తుంది. వివిధ పండుగ ల తిధి నిర్ణయాలు, విధి విధానాలు, బహు విధ శాంతి విధానాలు, వివాహాది శుభకార్యాలు, లగ్నఫలం, ముహూర్త నిర్ణయం మొదలైనవి ఈ గ్రంథం ద్వారానే తెలుస్తుంది.
అయితే, తెలంగాణా లోని వేద పండితులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. "అష్టమి తో కూడిన నవమి" కళ్యాణానికి పనికిరాదని కూడా "ధర్మసింధు" స్పష్టం చేస్తోందని వారు అంటున్నారు. ఆ ప్రకారమే, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం 26న స్వామివారి కల్యాణం జరిపించనుందని వారు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్, ఒంటిమిట్ట కోదండరామస్వామివారి కల్యాణోత్సవం మాత్రం మార్చి 30న నిర్వహించ నున్నారు. భద్రాచలంలో చైత్ర శుద్ధ నవమి రోజు కళ్యాణం నిర్వహిస్తే, ఒంటిమిట్ట లో మాత్రం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున కళ్యాణం జరుగుతుంది. అయితే, ఉత్తర భారతాన మాత్రం మార్చి 25ననే శ్రీరామనవమి వేడుకలు జరపుకోనున్నారు.