ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ అధ్యక్షునిగా జలీల్ ఖాన్ నియామకం జరిగిపోయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని మైనార్టీ నాయకులు అసంతృప్తితో అట్టుడికి పోతోంది. టిడిపి పుట్టిన్నాటినుండీ అంటే మూడున్నర దశాబ్దాలకు పైగా పార్టీని నమ్ముకొని విశ్వాసంతో పనిచేస్తుంటే పార్టీ అధినేత ఫిరాయింపు దారులను పిలిచి పదవులు పంచి పెడుతున్నారని అంటూ మండి పడుతున్నారు.
ఈ వరుస క్రమంలోనే సీనియర్ అయిన తనకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంపై మనస్థాపానికి గురైన టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్ బాబు తన పదవికి రాజీనామా చేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్, ఇతర డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేస్తుండగా అమీర్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ తరువాత నేరుగా సిఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి తన అసంతృప్తిని తెలియజేసి ఆయన పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయారని తెలిసింది.
బికాం లో ఫిజిక్స్ విజయవంతంగా చదివిన విఙ్జాన ఖని, వైసిపి నుంచి టిడిపి లోకి ఫిరాయించిన జంపింగ్ జపాంగ్ విజయవాడ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ ను వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం జలీల్ ఖాన్ ఇతర సభ్యులు డైరెక్టర్ లు గా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో సీనియర్ అయిన తనకు వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ పదవిని ఇచ్చి, ఈ మద్యనే పార్టీలోకి ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యే అయిన జలీల్ ఖాన్ కు ఛైర్మన్ పదవి ఎలా ఇచ్చారంటూ ప్రశ్నిస్తూ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్ బాబు రాజీనామా చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
తరువాత చంద్రబాబుకు కూడా ఇదే విషయం చెప్పి ఆయన పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయారట. కీలకమైన సమయంలో మైనారిటీ నేత నుంచి ఈ విధమైన షాక్ తగలడంతో చంద్రబాబు డంగై ఖంగుతిన్నారట. పైగా అమీర్ బాబుది ముస్లిం లు ఎక్కువగా ఉన్న కడప శాసనసభ నియోజకవర్గం కావడం, అక్కడ ఇప్పటికే పార్టీ బలహీనంగా ఉండటంతో టిడిపికి ప్రత్యేకించి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇది అతి పెద్ద షాకని, అందువల్ల అమీర్ బాబును బుజ్జగించే అవకాశాలు ముందు ముందు ఉంటాయని భావిస్తున్నారు.