చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బిజీ బిజీగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆయన మళ్లీ పార్లమెంట్ కు వెళ్లారు. గాంధీ విగ్రహం ముందు నమస్కారం పెట్టారు. ఆ తర్వాత పార్లమెంట్ మెట్లకు మొక్కి లోపలికి వెళ్లారు. ఆ తర్వాత సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించారు.
జాతీయ నేతలు సైతం చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ఉత్సాహం చూపించారట. ఇదీ చంద్రబాబు అనుకూల మీడియా ఇచ్చిన వార్తలు. ఐతే... సాక్షి పత్రిక మరో ఆసక్తికరమైన కథనం ఇచ్చింది. చంద్రబాబు మహాత్మ గాంధీకి, పార్లమెంట్ కు వంగి నమస్కారం పెట్టిన దృశ్యాన్ని వ్యంగ్యంగా వర్ణించింది.
చంద్రబాబు సహజంగానే మీడియాకు ఫోజులు ఇవ్వడం లో దిట్ట. అందులోనూ కీలకమైన టూర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారా.. ఉండరు కదా. గాంధీ విగ్రహానికి, పార్లమెంటుకూ మొక్కే విషయంలో ఆయన దృష్టి గాంధీ, పార్లమెంటు మెట్లపై కాకుండా మీడియా కెమేరాలవైపే ఉండటం విశేషం.
అంతే కాదు.. ఒకటికి రెండు సార్లు ఫోటోల కోసం వంగి వంగి దండాలు పెట్టారు. ఇందులో ఎక్కడా భక్తిభావం కాకుండా ఫోటో భావం మాత్రమే కనిపించింది. దీన్ని సాక్షి మీడియా బాగా హైలెట్ చేసింది. చంద్రబాబు యాక్షన్ చూడండహో అంటూ ఎలుగెత్తి చాటుతోంది.