పొత్తుల సంసారం ముగిసింది. ఇక ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. కత్తులు దూస్తూ బాబుగారిని చిత్తు చేసే నాయకుడి కోసం బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సీఎం చంద్రబాను ఢీకొట్టగలిగే కమలదళపతి కోసం వెతుకుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబును దీటుగా ఎదుర్కొంటూ పార్టీని ముందుకు నడిపించగలిగే అధ్యక్షుడు కమలదళానికి తక్షణ అవసరం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనీ కేంద్రం తేల్చి చెప్పిన తర్వాత అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి.
ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి.. ఆ తర్వాత ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడం.. కేంద్రంలో ఇద్దరు టీడీపీ మంత్రులు, రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామాలు చేయడం... కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ, టీడీపీలు వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేయడం.. చకచకా జరిగిపోయాయి. నాలుగేళ్లపాటు కలిసి నడిచిన బీజేపీ, టీడీపీలు ఇప్పడు బద్ధశత్రువులుగా మారాయి. ఏపీ అభివృద్ధికి చాలా చేశామని బీజేపీ నేతలు చెబుతుండగా... ఏపీకి తీరని ద్రోహం చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు జనసేన అధినేత పవన్కళ్యాణ్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేశ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతటి రాజకీయ క్లిష్ట పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించగలిగే నేత కోసం బీజేపీ నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఏపీకి కేంద్రం ఏం చేసిందో చెబుతూ.. చంద్రబాబు వ్యవహార శైలిని ఎండగడుతూ.. ఏపీకి బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెబుతూ ప్రజల్ని మెప్పించగలిగే వారి కోసం వెతుకుతోంది. ఇందులో ప్రముఖంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి.
మొదటిసారిగా సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసి కలకలం రేపిన సోము వీర్రాజు, ఇటీవల మంత్రి పదవి రాజీనామా చేసిన పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులోనాలుగేళ్లు మంత్రిగా కొనసాగి ఇప్పడు టీడీపీపై విమర్శలు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనలో బీజేపీ ఉంది. ఇతర పార్టీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్షపదవి ఇస్తే క్యాడర్ నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది.
ఇక మిగిలింది సోము వీర్రాజు. ఈయన పేరే చాలా సార్లు వినిపించింది. ఇటీవల తర్వాత అధ్యక్షుడు సోము వీర్రాజేనంటూ అసెంబ్లీ లాబీల్లో సరదాగా టీడీపీ నేతలతో అనడం గమనార్హం. దాదాపుగా త్వరలోనే సోము వీర్రాజును బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు హరిబాబును పక్కన బెడితే అది ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.