సాధారణంగా పురాణాల్లో నరమాంస భక్షకులు ఉండేవారని..వారు అడవుల్లో ఉంటారని..మనుషులు కనిపిస్తే రక్తం పీల్చుకొని మాంసం తింటారని వినేవాళ్లం. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మనుషులను తినే వారు ఉన్నారని అప్పుడప్పుడు వార్తలు వస్తునే ఉన్నాయి. కొన్ని ఆటవీ ప్రాంతాల్లో మనుషులను తినే తెగ ఉంటారని తెలుసు. తాజాగా ఓ నరమాంస భక్షకుడు చేసిన పని గురించి తెలిస్తే..నిజంగా వెన్నులోంచి వణుకు రావడం ఖాయం.
వివరాల్లోకి వెలితే..బార్లోవొంటో ప్రాంతానికి చెందిన లూయిస్ అల్ఫ్రెడో గొంజాలెజ్ హెర్నాండెజ్ వ్యక్తి ఓ మనిషిని చంపి అతని శరీర భాగాలు తిని, రక్తం, బూడిదతో పెయింటింగ్స్ వేశాడని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసిన అనంతరం విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు. సైంటిఫిక్, పీనల్, క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ బాడీ (సిఐసిపిసి) నిందితుడి ఫోటోలు ఆన్లైన్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. విచిత్రం ఏంటంటే..బాధితుడే నిందితుడిని ఈ భయంకరమైన చర్య చేపట్టేందుకు నియమించుకున్నాడట.
ఇది ఎంత వరకు నిజం అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సంఘటనా స్థలంలో కొన్ని పెయింటింగ్స్ను, ఇతర శరీర అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఇతర వ్యక్తులకు చెందిన కొన్ని అనుమానాస్పద డాక్యుమెంట్లను కూడా కనుగొన్నారు. అలాగే ఈ చిత్రాలు మానవ అవశేషాల నుండి తయారు చేయబడినవో కాదో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ అనాలిసిస్ నిర్వహించనున్నారు.